(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఉత్తరప్రదేశ్లో మరో అధికార పార్టీ ప్రజా ప్రతినిధి వివాదంలో చిక్కుకున్నారు. ఈ సారి సాక్షాత్తు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ క్యాబినెట్లోని మంత్రి బాబురాం నిషాద్పై ఆయన భార్య నీతూ నిషాద్ గృహహింస ఆరోపణలు చేసింది.
తన భర్త నిత్యం హింసిస్తున్నాడంటూ ప్రధాని మోది, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్కు మొరపెట్టుకున్నది. విడాకులకు సంబంధించిన పత్రాలపై సంతకం పెట్టాలంటూ బెదిరిస్తున్నారనీ లేకపోతే చంపేస్తానంటూ తుపాకీ గురిపెడుతున్నారనీ ఆమె ఆరోపించింది. తన ఆవేదన తెలియజేస్తూ ప్రధాని మోది, సిఎం యోగిలకు నీతూ లేఖ రాస్తూ తన ఆవేదన వీడియోను తన ఫేస్బుక్ పోస్టు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఓ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఇలా తనను తుపాకీ చూపించి కాల్చేస్తానని బెదిరించడం సమంజసమేనా అని లేఖలో పేర్కొన్నది. గతంలో చాలా సార్లు తనను కొట్టి హింసించారనీ, వేధింపులను భరించలేక చాలా సార్లు పోలీసులను ఆశ్రయించినా పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదనీ ఆమె ఆరోపించారు. తన భర్త పలుకుబడితో పోలీసులు కూడా తన ఫిర్యాదు స్వీకరించలేదని లేఖలో పేర్కొన్నది. తాను ఎదుర్కొంటున్న వేధింపులను కోర్టులో విన్నవించుకుంటానని చెప్పింది.
ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగాల్, మాజీ కేంద్ర మంత్రి చిన్మయానంద పలు ఆరోపణలపై జైలులో ఉన్నారు. తాజాగా ఆ రాష్ట్రంలోని మంత్రి బాబురాం నిషాద్పై ఆయన భార్య గృహహింస ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే బిజెపి నేతల తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నది.