తిరుమల: గతంలో మాదిరిగానే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని రెండు రోజులు మాత్రమే కల్పించనున్నట్లు టిడిపి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించే రోజులను పెంచే అంశంపై ఈ నెల ఆరవ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆదివారం ఆలయ పాలకవర్గ అత్యవసర సమావేశాన్ని చైర్మన్ వైవి అధ్యక్షతన నిర్వహించారు.సమావేశం అనంతరం అనంతరం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనంలో ఎటువంటి మార్పులు లేవనీ, ప్రతి ఏటా మాదిరిగానే దర్శనం రోజులు కొనసాగుతాయనీ తెలిపారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగ శ్రీవారి ఆలయంలో రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వారం తెరిచి ఉంచాలన్న నిర్ణయం వల్ల ఎక్కువ మంది భక్తులకు అవకాశం దక్కదనీ, కావున భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార ప్రదేశం కల్పించేలా టిటిడి ఇఒకు ఆదేశించాలనీ కోరుతూ న్యాయవాది తాళ్లపాక రాఘవన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కాగా ఇప్పటి వరకూ కొండ కింద నుండి కాలినడకన వచ్చిన భక్తులకు మాత్రమే ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నామనీ, దాన్ని విస్తృతం చేయడం కోసం శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయాలని గత పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలన జరిపిన తరువాత ఈ నెల 20వ తేదీ నుండి ఈ ఉచిత లడ్డూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించడం జరిగిందని వైవి తెలిపారు.