అమరావతి: కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వంశీ వైసిపి చేరిక ముహూర్తం దాదాపు ఖరారు అయ్యిందని సమాచారం. నవంబర్ మూడు లేదా నాలుగవ తేదీ వైసిపి అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సమక్షంలో వంశీ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అనుచరులతో చెప్పినట్లు తెలుస్తోంది.
వంశీ ఇటీవల టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. వంశీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు వంశీకి రెండు లేఖలు రాసినప్పటికీ ఆయన సానుకూలంగా స్పందిచలేదు. దీంతో వంశీని బుజ్జగించి పార్టీలోనే కొనసాగించేలా చూడాలంటూ విజయవాడ ఎంపి కేశినేని నాని, మాజీ ఎంపి కొనకళ్ల నారాయణలకు చంద్రబాబు బాధ్యతను అప్పగించారు. అయితే కేశినేని నాని మూడు గంటలకు పైగా వంశీలో చర్చలు జరపగా ఆయన ఇబ్బందులను వివరించినట్లు తెలిసింది. వంశీతో జరిగిన చర్చల సారాంశాన్ని కేశినేని చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది.
వంశీ వైసిపిలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గన్నవరం వైసిపి ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్మెంట్ లభించలేదని తెలుస్తోంది. అయితే ముఖ్యనేతల ద్వారా ఆయనను సముదాయించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వంశీ పార్టీలో చేరినా వెంకట్రావుకు ఎటువంటి ప్రాధాన్యత తగ్గకుండా ఎమ్మెల్సీ ఆఫర్ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా యార్లగడ్డ వెంకట్రావుకు ఎమ్మెల్సీ ఆఫర్పై సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
అదే నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు పార్టీలో వంశీ చేరికను వ్యతిరేకించడం లేదని సమాచారం. పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. వంశీ అధికారికంగా వైసిపిలో చేరబోయే ముందు స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను పంపనున్నారు.