అమరావతి: కృష్ణాజిల్లా గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు ఆదివారం పంపారు. కొందరి వల్ల పార్టీ క్యాడర్ ఇబ్బందులు పడుతున్నారని వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు వంశీ ప్రకటించారు.
రెండు రోజుల క్రితం బిజెపి ఎంపి సుజనా చౌదరిని, తరువాత వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని వంశీ కలిసిన విషయం తెలిసిందే. ఇటీవల వంశీపై ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారన్న అభియోగంపై కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో వంశీ పార్టీ మారనున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే దీపావళి పండుగ తరువాత పార్టీ మార్పుపై స్పందిస్తానని తెలిపిన వంశీ అనూహ్యంగా ఆదివారం నాడే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వంశీ వైసిపిలో చేరికను యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిమాణాల క్రమంలో వంశీ పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు రాజకీయాల నుండి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.