అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం.. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి సభలో సీటు కేటాయించాలని స్పీకర్ తమ్మినేనిని కోరిన వంశీ… ఇవాళ టీడీపీ సభ్యులు కూర్చునే మొదటి వరుసలో.. కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి పక్క సీట్లో వంశీ కూర్చున్నారు. మీడియాపై ఆంక్షలు, 2430 జీవోపై సభలో హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వంశీ స్లిప్పులు రాసి పంపించారు. వంశీ ఎమ్మెల్యేలకు పంపిన స్లిప్పులో ఏం రాసి ఉందన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీని ఇరుకున పెట్టే అంశాలనే అందులో ప్రస్తావించి ఉండొచ్చనే చర్చ నడుస్తోంది.
రెండు రోజుల క్రితం తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్ తమ్మినేనిని వంశీ కోరిన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి తనను సస్పెండ్ చేశారని.. తాను గన్నవరం నియోజకవర్గ ప్రజల సమస్యల్ని వినిపించేందుకు సభలో కొనసాగాలనుకుంటున్నానని తెలిపారు. తనకు వేరేగా సీట కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్.. సభలో ఎక్కడైనా కూర్చోవచ్చని చెప్పారు. అయితే వంశీ సభలో గురువారం వ్యవహరించిన తీరు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.