ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించిన విధంగా పాలనా వికేంద్రీకరణకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో అమరావతి ప్రాంత రైతాంగం మళ్ళీ రోడ్డు ఎక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రైతులకు మద్దతుగా..అమరావతి నుండి విశాఖకు రాజధాని తరలించడానికి వీలులేదంటూ టీడీపీతో సహా ఇతర రాజకీయ పక్షాలు ఆందోళనకు సమాయత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాలలో అమరావతి సెంటిమెంట్ బలంగా పనిచేస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అని వైసీపీలోని కొందరు ఎమ్మెల్యేలు అంతర్మధనంలో పడుతున్నారట. ఈ పరిస్థితిలోనూ తాను వైసీపీ నుండి పోటీ చేసి గెలిచేందుకు సిద్ధంగా ఉన్నానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం కల్గిస్తుండగా.. వల్లభనేని వంశీ ధైర్యానికి కారణం ఏమిటి? అని కూడా చర్చించుకుంటున్నారు. మరో పక్క టీడీపీ నుండి వైసీపీ, వైసీపీ నుండి టీడీపీ రాజీనామాలు చేసి ప్రజాతీర్పు కోరాలని సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారు.
వైసీపీ ఫ్యాన్ గాలిలోనూ…
వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుండి రెండవ సారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా వీచిన వైసీపీ ఫ్యాన్ గాలిలోనూ వంశీ టీడీపీ తరపున ఎమ్మెల్యే గా గెలవడం విశేషమే. ఎన్నికల అనంతరం జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో వల్లభనేని వంశీ అధికారికంగా పార్టీ కండువా కప్పుకోలేదు కానీ వైసీపీకి గూటికి చేరిపోయారు. ఎన్నికలకు ముందే వంశీని వైసీపీలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి.
వంశీ గెలుపునకు పకడ్బందీ వ్యూహాలు
వల్లభనేని వంశీ రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే రెండు రోజుల క్రితం వెల్లడించారు. ఉప ఎన్నికల్లో గెలుపునకు ఇప్పటి నుండే అయన వ్యూహాన్ని రచించుకున్నట్లు సమాచారం. టీడీపీలోని తన సన్నిహితులు, పాత పరిచయస్తులతో చర్చించడంతో పాటు వైసీపీలో కూడా వర్గ విభేదాలు రాకుండా గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తనపై ఓడిపోయిన యార్లగడ్డ వెంకటరావు, నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత దట్టు రామచంద్ర రావు వర్గీయుల మద్దతునూ కూడగట్టుకునేందుకు పావులు కదుపుతున్నారు. అర్ధబలం, అంగబలం, అధికార బలం అన్నీ ఉపయోగించుకొని ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని వంశీ అనుకుంటున్నారు. ఆలా జరిగేతే టీడీపీపై మరింత గట్టిగా విమర్శలు చేయడానికి అవకాశం చిక్కుతుందనీ, సీఎం జగన్ వద్ద తన ఇమేజ్ పెరుగుతుందనీ భావిస్తున్నారట వల్లభనేని వంశీ.