అమరావతి, మార్చి 13: ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో బుధవారం రాత్రి దివంగత నేత వంగవీటి మోహన రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరారు.
పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, వంగవీటి అభిమానులతో రాధాకృష్ణ భారీ ర్యాలీగా తరలివచ్చి టిడిపిలో చేరారు. రాధాతో పాటు పార్టీలో చేరిన వారందరికీ చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా పేద వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న రాధను అభినందించారు.
బీసీలకు అన్యాయం జరక్కుండా కాపులకు రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.
నెల 15 రోజుల క్రితం వంగవీటి రాధాకృష్ణ వైసిపికి రాజీనామా చేశారు. రాధా కృష్ణ టీడీపీలో చేరిక పై మాజీ ఎంపీ రాజగోపాల్ గత రెండు రోజులుగా దౌత్యం నడిపి విషయం తెలిసిందే.
ఈ సందర్భంలో వంగవీటి రాధాకృష్ణ వైసిపి అధినేత జగన్మోహన రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో తనకు జరిగిన వెన్నుపోటు అన్యాయాలను వివరించారు. తన తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా తాను పని చేస్తానని, పేదలకు న్యాయం జరిగేందుకే తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.