ప్రస్తుత రాజకీయాలలో పది కాలాల పాటు నిలదొక్కుకొని కొనసాగాలంటే కాస్త లౌక్యం, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మనస్తత్వం కలిగి ఉండాలి. పాపం బీజేపీ నేత వెలగపూడి గోపాల కృష్ణ ప్రసాద్ కు వాటి గురించి పెద్దగా తెలిసినట్లు లేదు. అందుకే డంగ్ అయిపోయారు. ఒక పదవి పొతే నేమి మరో పదవి ఆయనను వెంటనే వరించింది అనుకోండి. బీజేపీ.. అయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే వెంటనే జాతీయ హిందూ మహాసభ అక్కున చేర్చుకున్నది. రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చి గౌరవించింది కూడా.
అసలు విషయంలోకి వెలితే….రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా ఉన్న తరుణంలో బీజేపీ అధ్యక్షుడు గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. అమరావతికే జై కొట్టారు. అమరావతి ప్రాంతంలో రైతులు చేస్తున్న ఆందోళనల కు మద్దతుగా పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుల్లో రాజధాని విషయంలో డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్నప్పటికీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా ఉన్న కారణంగా పార్టీలో మెజారిటీ వర్గాలను ఒప్పించి అమరావతి కి అనుకూలంగా తీర్మానం కూడా చేయించారు. టీడీపీకి కాస్త అనుకూలంగా ఉంటూ వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను పార్టీ అధిష్టానం తప్పించి టీడీపీని బద్ద శత్రువుగా చూస్తూ వైసీపీపై సాఫ్ట్ కార్నర్ తో ఉన్న సోము వీర్రాజు కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే.
ఈ విషయం ఇప్పుడెందుకు అంటే.. పార్టీ రధసారధి అభిప్రాయాలు, ఆలోచనలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు నడుచుకోవాలి. కానీ ఈ విషయాలు ఏమి పట్టని వెలగపూడి గోపాలకృష్ణ అమరావతి రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. తమ పార్టీ కూడా రైతుల పక్షాన నిలబడలేకపోతున్నదన్న బాధతో చెప్పుతో బాదుకోవడం, అనంతరం పార్టీ ఆగ్రహానికి గురై సస్పెండ్ అవ్వడం విదితమే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే జాతీయ స్థాయిలో హిందుత్వ పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీకి మద్దతు ఇచ్చే అఖిల భారత హిందూ మహాసభ బీజేపీ నుండి సస్పెండ్ అయిన వెలగపూడికి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టడం.
ఇది ఎందుకు జరిగింది అంటే..
అఖిల భారత హిందూమహా సభ తొలి నుండి అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నది. అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆచార్య జేవీఆర్ శాస్త్రి అమరావతి పరిరక్షణ సమితికి గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. జాతీయ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ కూడా గతంలో అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అయోధ్య నుండి అమరావతికి పెద్ద ఎత్తున సాధువులతో పాదయాత్ర కూడా నిర్వహించాలని భావించారు. కరోనా నేపథ్యంలో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. కాగా హిందూ మహాసభ కు ఇప్పటి వరకు ఏపీ అధ్యక్షుడు గా ఎవరు లేకపోవడంతో తెలంగాణ శాఖ అధ్యక్షులుగా ఉన్న ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు కూడా చూస్తూ వచ్చారు. బీజేపీ నుండి వెలగపూడి గోపాలకృష్ణ సస్పెండ్ కావడం, ఆ వెంటనే అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితులు కావడం చెక చెక జరిగి పోయాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?