తాడేపల్లిగూడెం: అభివృద్ధి వికేంద్రీకరణపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని నిట్ స్నాతకోత్సవంలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల నుంచి గ్రామస్థాయి వరకు అభివృద్ధి జరగాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగిపోతున్నాయని అన్నారు. విద్య, వైద్య, ఉపాధి అవకాశాల కారణంగానే ఎక్కువ మంది పట్టణ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నివాలరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అభివృద్ధి కేవలం జిల్లా ప్రాంతాలకే పరిమితం కాకూడదని.. గ్రామీణ ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాజధానిలో అన్నీ ఉంటే మిగతా ప్రాంతాల అభివృద్ధి జరగదన్నారు. అయితే ప్రస్తుతం నెలకొన్న రాజధాని వివాదానికి, తాను చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసి వలసలను నివారించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
రాబోయే రోజుల్లో నీళ్ల కోసం పోరాడే పరిస్థితి వస్తుందని తెలిపారు. వ్యవసాయంపై అందరూ దృష్టి పెట్టాలని, మేధాశక్తితో భావి ఇంజనీర్లు దేశ ప్రజల అభివృద్ధికి పాటుపడాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మాతృభాషను మర్చిపోవద్దని సూచించారు. భాష, భావం రెండు కలిసి నడుస్తాయని పేర్కొన్నారు. మాతృ భాషలోనే మాట్లాడాలని.. ఇంగ్లీషు నెర్చుకోవటంలో తప్పు లేదన్నారు. భాషలు, వేషాలు వేరు కావచ్చు కానీ మనమంతా ఒక్కటే అని తెలిపారు. దేశ సమైక్యత, సార్వభౌమత్వానికి విరుద్దంగా ప్రవర్తించకుడాదని చెప్పారు. రైతులకు మంచి సామర్థ్యం కలిగిన విద్యుత్ అందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.