(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: సిఎం కాన్వాయ్ వస్తుందంటే పోలీసులు ఎక్కడికక్కడ రోడ్ బ్లాక్ చేయడం ఎప్పుడూ జరుగుతుండేది. అయితే ఇక్కడ సిఎం కాన్వాయ్ కోసం దేవుడి ఊరేగింపును సైతం అరగంట పాటు నిలువరించారు పోలీసులు. ఈ ఘటన రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది.
మూడు రాజధానుల ప్రకటన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో రెండు వారాలుగా రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం సిఎం జగన్ సచివాలయం వెళుతున్న సందర్భంగా మందడం గ్రామంలో భద్రతా కారణాల రీత్యా పోలీసులు విస్తృత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా గ్రామంలోని శ్రీవేణుగోపాలస్వామి ఊరేగింపు జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ రావడంతో సుమారు 30 నిమిషాల పాటు దేవుడి ఉరేగింపును పోలీసులు నిలిపివేశారు. అయిదు నిమిషాల్లో కాన్వాయ్ వస్తుందంటే రోడ్డుపై రాకపోకలను నిలిపినా అర్థం ఉంటుందనీ, అరగంట పాటు నిలిపివేయడం సరికాదనీ గ్రామస్తులు మండిపడ్డారు. పోలీసుల చర్యను గ్రామస్తులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.