(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై బహిరంగంగా స్పందించారు. రేపిస్టులకు మరణశిక్ష విధించేందుకు వీలుగా రాష్ట్ర శాసనసభ చేసిన చట్ట సవరణను ట్విట్టర్ వేదికగా శ్లాఘించారు. ఈ చట్ట సవరణ బిల్లు తెచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయన పొగడ్తల వర్షం కురిపించడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
హఠాత్తుగా వెంకయ్య నాయుడు ఇలా జగన్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందన్న చర్చ మొదలయింది. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి జగన్ వెంకయ్య నాయుడిపై విమర్శలు చేస్తున్నారు. ప్రాధమిక విద్య స్థాయిలో కూడా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై వచ్చిన విమర్శను ఎదుర్కొంటూ సిఎం ఏకంగా శాసనసభలోనే వెంకయ్య నాయుడిపై విమర్శ చేశారు. ఒకసారితో పోనివ్వకుండా మూడు సార్లు ఉపరాష్ట్రపతి ప్రస్తావన తెచ్చారు. ఇంగ్లీషు మీడియంను ఒక కులం వారే వ్యతిరేకిస్తున్నారని జగన్ అంటున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడూ, వెంకయ్య నాయుడూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారన్నది ఇక్కడ గమనార్హం.
తెలుగు రాష్ట్రాల వ్యవహారాలలో, ముఖ్యంగా తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలలో వెంకయ్య నాయుడికి ఉన్న ఆసక్తి అందరికీ తెలుసు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న గత అయిదు సంవత్సరాలలో విభజనాంతర ఇబ్బందులలో ఉన్న రాష్ట్రానికి ఎప్పుడైనా ఏదన్నా మాట సాయం అవసరం వచ్చినపుడు వెంకయ్య నాయుడు అది అందిస్తూ వచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికీ ఉపరాష్ట్రపతి కార్యాలయానికీ మధ్య లింకు లేకుండా పోయింది. ప్రాధమిక విద్య స్థాయిలో మాతృభాషలోనే బోధించాలన్న తన వైఖరిని ఆ విషయానికి సంబంధించినదిగా చూడకుండా జగన్ వ్యతిరేక భావన పెంచుకోవడం వెంకయ్యను బాధించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజన పర్యవసానాలను ఇంకా అనుభవిస్తున్న ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంతో తాను మంచిగా ఉండాలన్నదే ఆయన అభిమతమని అంటున్నారు. అందువల్లనే ఆయన జగన్ ప్రభుత్వానికి ఒక సానుకూల సంకేతం పంపారేమోనని అంటున్నారు.