హైదరాబాద్: నిత్యం ఎదో ఒక విషయంపై మాటలు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు టిటిడి బంగారం తరలింపు వ్యవహారంపై ఎందుకు స్పందించటం లేదని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
బుధవారం విజయసాయి రెడ్డి హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. విజయవాడలో 40 దేవాలయాలను కూలగొట్టారనీ,తిరిగి కట్టిస్తామని చెప్పి ఇంతవరకు పునర్మించింది లేదని విజయసాయి రెడ్డి విమర్శించారు.మసీదులను,చర్చిలను సైతం కూలగొట్టారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కృష్ణా,గోదావరి పుష్కరాలకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనీ, దేవుడి సొమ్ము అంటే చంద్రబాబుకు భయంలేదనీ విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు.
చెన్నై నుంచి తిరుపతికి వచ్చే బంగారం జాతీయ రహదారిపై కాకుండా లోపలి రోడ్డు మీదుగా ఎందుకు తరలించాల్సి వచ్చిందని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. పెద్ద మొత్తంలో బంగారం తరలిస్తున్నప్పుడు టిటిడి అధికారులు ఎందుకు లేరని ఆయన నిలదీశారు. టిటిడి బంగారం తరలింపుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం నియమించిన కమిటీ నివేదిక సమర్పించాక అందులోని వివరాలను బయటపెట్టాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
టిటిడి ప్రధాన అర్చకులు రమణదీక్షితులను తొలగించారనీ, మంత్రి యనమల వియ్యంకుడుని టిటిడి బోర్డు ఛైర్మన్ గా నియమించారనీ, దీన్నిబట్టి దొంగతనం, దొపిడీ చేయడానికి ప్రణాళిక బద్దంగా ఇవన్నీ చేశారనన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని విజయసాయిరెడ్డి విమర్శించారు.
గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాలు మాయమయ్యాయనీ, ఏ ఇంట్లో సోదా చేస్తే ఆ కిరీటాలు దొరుకుతాయో పోలీసులకు తెలుసనీ, అయినప్పటికీ, జేబుదొంగలు ఇద్దర్ని పట్టుకుని వారే కిరీటాలు దొంగిలించారని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.
చంద్రబాబు హయాంలో ఐదుగురు సిఎస్ లుగా పనిచేస్తే ముగ్గురు ఆయన పనితీరును వ్యతిరేకించారని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు తన స్వార్ద రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని దుష్ప్రచారం చేశారని విజయసాయిరెడ్డి విమర్శించారు. జగన్ పై కాంగ్రెస్ తో కుమ్మక్కై దొంగ కేసులు పెట్టారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ప్రజావేదికను పార్టీ కార్యక్రమాలకు వాడుకోవడం ఎన్నికల కమిషన్ నిబంధనలకు వ్యతిరేకమనీ, టిడిపి నిబంధనలు ఉల్లంఘిస్తే తప్పకుండా ఫిర్యాదు చేసి తీరుతామని విజయసాయిరెడ్డి తెలిపారు.