వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపినందుకు మాజీ సిబిఐ అధికారి వి.వి.లక్ష్మీనారాయణను వైసిపి వర్గాలు బహుశా జీవితాంతం క్షమించలేవు. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని కూడా సంవత్సరం దాటింది. నిన్న జనసేనలో చేరిన లక్ష్మీనారాయణను వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చంద్రబాబు జవాను అంటున్నారు.
సోమవారం విజయసాయి రెడ్డి చేసిన ఒక ట్వీట్ సారాంశం ఏమంటే: పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన టిడిపి అనుబంధ సంస్థ. టిడిపిలో చేరితే జనం ఛీకొడతారని లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు.
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత జగన్పై క్విడ్ ప్రో కో కేసులు వెలికివచ్చాయి. అప్పట్లో హైదరాబాద్ సిబిఐ కార్యాలయంలో జాయింట్ డైరక్టర్గా పనిచేసిన లక్ష్మీనారాయణ ఈ కేసులను దర్యాప్తు చేశారు. 2012లో ఈ కేసులకు సంబంధించి జగన్ను సిబిఐ అరెస్టు చేసింది. 16 నెలల పాటు జగన్ జైలు జీవితం గడపాల్సి వచ్చింది.
నిజానికి జగన్పై సిబిఐ కేసులను లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసినపుడు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అప్పట్లో తన మాట కాదన్నందుకు సోనియాగాంధీ జగన్పై కక్ష సాధిస్తున్నారని వైసిపి విమర్శించింది.
మొన్న లక్ష్మీనారాయణ టిడిపిలో చేరుతున్నారన్న వార్త రాగానే వైసిపి స్పందించింది. చంద్రబాబు, లక్ష్మీనారాయణ ముందునుంచీ తోడుదొంగలన్న సంగతి వెల్లడయిందని ఈ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. తాను టిడిపిలో చేరడం లేదన్న లక్ష్మీనారాయణ తర్వాత జనసేనలో చేరారు. జనసేన ద్వారా కూడా అయన చంద్రబాబు పనే చేస్తారని విజయసాయి రెడ్డి అంటున్నారు.
ఇప్పుడు జనసైనికుడిగా మారడమేమిటి లక్ష్మినారాయణ గారూ. మీరు మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే జవానే గదా. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీకొడతారని అనుబంధ సంస్థలో చేరారు. ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేసారో, ఇకపై ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 18, 2019