అమరావతి: ఎన్నికల షాక్ నుండి తేరుకోకముందే చంద్రబాబు మరో యు టర్న్ తీసుకున్నారంటూ వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, టిడిపి వర్గీయులనూ విమర్శించారు.
‘ఇకపై చంద్రబాబు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యుపిఎలో కొనసాగరట, కేంద్రంపై పోరాటాలకు విరామం ఇస్తారట’ అని విజయసాయిరెడ్డి అన్నారు.
మోది, అమిత్షాకు మోకరిల్లే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శిస్తూ ముగ్గురు ఎంపిలతో ఆయన ఎన్ని యుటర్న్లు తీసుకున్నా పట్టించుకునే వారుండరని ఎద్దేవా చేశారు.
ఎన్నికల షాక్ నుంచి తేరుకోకముందే చంద్రబాబు మరో యూ-టర్న్. ఇకపై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యుపిఏలో కొనసాగరట. కేంద్రంపై పోరాటాలకు విరామం ఇస్తారట. అర్థమవుతోంది గదా…మోదీ, అమిత్షాకు మోకరిల్లే ప్రయత్నం అని. ముగ్గురు ఎంపీలతో ఆయన ఎన్ని యూ టర్నులు తీసుకున్నా పట్టించుకునే వారుండరు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 16, 2019
సిఎంగా ఉన్నప్పటి ప్రభుత్వ మర్యాదలు, మినహయింపులు ఇంకా కొనసాగాలని చంద్రబాబు ఆశిస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఆయనకు వాతలు పెట్టిన ప్రజలకు ఇవన్నీ ప్రాముఖ్యత లేని అంశాలుగా కనిపిస్తున్నాయని విజయసాయిరెడ్డి అన్నారు.
యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజల పట్ల కనబరుస్తున్న శ్రద్ధ, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలలో కొత్త
ఆశలు నింపాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీ తమ నాయకుడి సౌకర్యాలు, ఇబ్బందుల గురించి ఆందోళనకు దిగడం సిగ్గుచేటని విజయసాయిరెడ్డి అన్నారు. విమానాశ్రయ భద్రతా నిబంధనలు ఎవరైనా పాటించాల్సిందేననీ, ప్రజలు ఛీకొట్టిన తరువాత కూడా ఇంకా సిఎంగానే కొనసాగుతున్నట్లు ఆయన భ్రమపడటం, టిడిపి వర్గీయులు భజన చేయడం ఎబ్బెట్టుగా ఉందంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.