కడప: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడుగా భావిస్తున్న శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. కడప ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శ్రీనివాసులరెడ్డి మృతి చెందాడు. పోలీసుల వేధింపుల తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీనివాసులరెడ్డి సూసైడ్నోట్లో పేర్కొన్నాడు. వివేకా హత్యకేసుతో తనకు సంబంధం లేదంటూ లేఖలో శ్రీనివాసరెడ్డి వాపోయాడు. సిఎం జగన్మోహనరెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డిలకు శ్రీనివాసులరెడ్డి వేరు వేరుగా లేఖలు రాశాడు. సూసైడ్ నోట్ను కుటుంబ సభ్యులకు డాక్టర్లు అందజేశారు. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యపై ఆయన కుమారుడు స్పందించాడు.‘రెండు రోజుల క్రితం పోలీసులు విచారణకు పిలిచారు. వివేకానంద రెడ్డి హత్య కేసుతో సంబంధం లేకపోయినా విచారణ ఎదుర్కొవాల్సి రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్ కుటుంబం అంటే మా నాన్నకు చాలా అభిమానం’ అని శ్రీనివాసరెడ్డి కుమారుడు పేర్కొన్నారు. శ్రీనివాసరెడ్డిని సిఐ రాములు తీవ్రంగా వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణను వేగంవంతం చేసింది. వివేకా ఇంటి వాచ్మన్ రంగయ్యకు నార్కో అనాలసిస్, పాలిగ్రాఫ్, బీప్ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరగా న్యాయమూర్తి కిశోర్కుమార్ అనుమతి ఇచ్చారు. కోర్టు అనుమతితో పులివెందుల డిఎస్పి వాసుదేవన్ ఆధ్వర్యంలో రంగయ్యను హైదరాబాద్ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా పోలీసులు అప్పట్లో సుమారు 60 మందికిపైగా వ్యక్తులను ప్రశ్నించారు.
ఘటనా స్థలంలో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంపై ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్పై కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు చేసి జైలుకు తరలించారు. కేసు నమోదు చేసిన 90 రోజుల వరకూ చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో వీరికి జూన్ 27న కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కాగా ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసరెడ్డి సూసైడ్ లేఖలో రెండు రకాల రాతలు ఉండటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిఐ రాములు పనితీరుపై ప్రాధమిక నివేదకను ఉన్నతాధికారులు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాసరెడ్డి పేరున్న వ్యక్తి కోసం కానిస్టేబుల్ను పంపితే ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసరెడ్డిని తీసుకువచ్చారనీ ప్రాధమిక నివేదిక ద్వారా తెలిసినట్లు సమాచారం. అసలు శ్రీనివాసరెడ్డి కాదని తేలడంతో స్టేషన్కు పిలిచిన అయిదు నిమిషాల్లోనే అతనిని పోలీసులు పంపినట్లు పేర్కొన్నారు. అతని ఆత్మహత్య వెనుక వేరే కారణాలు ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఉన్నతాధికారులు ఆదేశించారు. కడప పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు కోసం రాయలసీమ రేంజ్ నుండి ఉన్నతాధికారులు వెళ్లినట్లు తెలుస్తోంది.