2014 కంటే 6.5 శాతం అధికం
బీజేపీకి 32.. కాంగ్రెస్ పార్టీకి 19.6%
న్యూఢిల్లీ: ‘‘దేశంలో ఇప్పుడు రెండే కులాలున్నాయి. ఒకరు పేదవాళ్లు, మరొకరు పేదరికాన్ని నిర్మూలించాలనుకునే వాళ్లు’’… భారీ విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పిన మాటలివి. యూపీలో ప్రతిపక్ష కూటమని, దుర్భేద్యమైన పశ్చిమ బెంగాల్ ను కూడా ఛేదించి మోదీ నాయకత్వంలో భాజపా వరుసగా మరోసారి అధికారంలోకి వచ్చింది. సొంతంగా 303 స్థానాలు సాధించింది. కాంగ్రెసేతర పార్టీలలో ఇంత ఆధిక్యం, వరుసగా రెండోసారి ప్రధాని పదవి పొందడం మోదీ మాత్రమే సాధించిన విజయాలు. 1971లో ఇందిరాగాంధీకి మాత్రమే ఇంత బలం వచ్చింది. 48 ఏళ్ల తర్వాత మళ్లీ మోదీ దాన్ని సాధించారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి ఈ విజయానందాన్ని మోదీ తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలతో పంచుకున్నారు. ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం. నేను ఏ పనిచేసినా చెడ్డ ఉద్దేశంతో, చెడు కోరికలతో చేయను. నేను తప్పులు చేయచ్చు, నా స్వార్థం కోసం ఏమీ చేసుకోను. నా జీవితంలో ప్రతి క్షణం, నా శరీరంలో ప్రతి కణం దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరంగా కృషి చేస్తూనే ఉంటాయి’’ అని కార్యకర్తలకు మోదీ చెప్పారు. కురుక్షేత్ర సంగ్రామంత తర్వాత తాను హస్తినాపురి వైపున్నానని శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా 130 కోట్ల మంది భారతీయులు తాము భారతదేశం వైపున్నామని చెప్పారన్నారు. 2014లో తానెవరో చాలామందికి తెలియనప్పుడు తాను వచ్చానని, కానీ 2019లో తానెవరో తెలిసిన తర్వాత మరింత పెద్ద విజయం అందించారని కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఈ ఫకీరు జోలెను నింపేశారు’’ అని ఉద్వేగంగా చెప్పారు. ఇది వారసత్వ, కుల రాజకీయాలపై సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు.
అదే సమయంలో ప్రతిపక్షాల మీద మోదీ విరుచుకుపడ్డారు. ఆ పార్టీలు వేసుకున్న లౌకికవాద ముసుగును ఫలితాలు తొలగించాయని విమర్వించారు. ఈ ఎన్నికల్లో లౌకికవాద ముసుగులో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా దేశాన్ని తప్పుదోవ పట్టించలేకపోయిందని చెప్పారు. అవినీతి, ద్రవ్యోల్బణం ప్రచార అంశాలు కాని ఏకైక ఎన్నికలు ఇవేనన్నారు. ఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయిందని ఎద్దేవా చేశారు.
లోక్ సభలో ప్రతిపక్ష నేత స్థానాన్ని పొందడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి తగినన్ని స్థానాలు లభించలేదు. 2014తో పోలిస్తే బీజేపీకి ఓట్లశాతం గణనీయంగా మెరుగుపడింది. ఈ ఎన్నికలలో మొత్తం 60.37 కోట్ల మంది ఓట్లు వేస్తే, అందులో 22.6 కోట్ల మంది బీజేపీనే ఎంచుకున్నారు. ఐదేళ్ల క్రితం బీజేపీకి 5.5 కోట్ల మంది ఓటర్లు పెరగడంతో ఈసారి ఏకంగా 32 శాతం ఓట్లను ఆ పార్టీ సాధించగలిగింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ఓట్ల శాతాన్ని 19.3 నుంచి కేవలం 19.6కు మాత్రమే పెంచుకోగలిగింది. 2014లో తమకు ఓటేసిన 10.69 కోట్ల కంటే ఈసారి కేవలం 1.17 కోట్ల మంది కొత్త ఓటర్లనే ఆకట్టుకోగలిగింది. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో బీజేపీకి ఈసారి 50 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. బీజేపీ ఓట్లు బాగా తగ్గిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అక్కడ గతం కంటే 7.5శాతం తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ విజయం చూసి ప్రతిపక్షాలు కంగుతిన్నాయి. వ్యవసాయ సంక్షోభం, పెద్దనోట్ల రద్దు ప్రభావం, నిత్యాసవరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రైవేటు పెట్టుబడుల తగ్గుదల.. ఇవన్నీ ఓటర్లపై ప్రభావం చూపుతాయని విపక్ష నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ, బీజేపీ మాత్రం వాటన్నింటినీ అధిగమంచి మరీ ఘన విజయం సాధించింది. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాలలో బీజేపీ భారీ విజయాలను నమోదు చేసుకోడానికి చాలా కారణాలున్నాయి. 80ల చివరి కాలంలో దేశంలో మొదలైన మండల్ రాజకీయాలు మళ్లీ పురుడు పోసుకోవడం వాటిలో ఒకటి. దానికితోడు హర్యానా, గుజరాత్, మహారాష్ట్రలలో బీజేపీ విజయం జాట్లు, పాటీదార్లు, మరాఠాల లాంటి ప్రభావశీల వర్గాల ఆశీస్సుల ఫలితమే. వీళ్లంతా 2014లో బీజేపీకి వ్యతిరేకంగా నిలిచారు.
ఈ ఎన్నికలు వామపక్షాలను చారిత్రక లోతుల్లోకి నెట్టేశాయి. బీజేపీ మాత్రం జాతీయవాదాన్నే భుజానికెత్తుకుని ప్రగ్యాసింగ్ ఠాకుర్ లాంటి వారిని కూడా గెలిపించుకోగలిగింది. తొలిసారి ఓటర్లు రికార్డు సంఖ్యలో పెరగడంతో, వారసత్వ రాజకీయాలను దునుమాడిన బీజేపీని వారు ఆదరించారు. కాంగ్రెస్, ఎస్పీ, టీడీపీ, టీఆర్ఎస్, జేడీఎస్ లకు అందుకే ఓటమి ఎదురైంది. పట్టణ ప్రాంతాల్లోనే బీజేపీకి పట్టుందన్న వాదనను ఈ ఎన్నికలు ఛేదించాయి. హిందీ బెల్టులోని కీలక ప్రాంతాల్లో గ్రామీణ ఓటర్ల అండ బీజేపీకి బాగా లాభించింది. పశ్చిమ బెంగాల్ లాంటి కొత్త ప్రాంతాలకు కూడా ఈసారి ఆ పార్టీ విస్తరించింది. ఒడిశా, తెలంగాణలలోనూ అడుగు పెట్టగలిగింది. ఒడిశాలో ఆ పార్టీ ఓట్లు 17 శాతం పెరిగాయి. 2014లో 21.5% రాగా ఈసారి 38% వచ్చాయి. బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావించిన పశ్చిమ బెంగాల్ లో ఇంతకుముందు 18% ఉన్న ఓట్లు ఈసారి 40%కు పెరిగాయి. దాంతో రాబోయే ఐదేళ్లలో కేరళ, తెలంగాణ రాష్ట్రాలపై బీజేపీ దృష్టిపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే 2021లో పశ్చిమ బెంగాల్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీల మధ్యే ప్రత్యక్ష పోరు ఉండనుంది. అయితే 84 లోక్ సభ స్థానాలతో బలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో మాత్రం ఆ పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలో బాగా బలపడాల్సి ఉంది.