కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘పార్టీల మధ్య భేదం ఇదీ’ అన్న కేప్షన్ వాటికి పెట్టి షేర్ చేసుకున్నారు. ఆ రెండూ ఒక్కసారి ముందు నుంచి చూస్తే గాంధీనగర్ నియోజకవర్గంలో అమిత్ షా లేచి నిలబడి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి ఇస్తుంటే, రాహుల్ మాత్రం తన కుర్చీలోనే కూర్చుని ఇస్తుండగా ఎన్నికల అధికారి మాత్రం లేచి నిలబడి తీసుకుంటున్నట్లు ఉంది. ఈ విషయాన్ని ఆల్ట్ న్యూస్ వెబ్ సైట్ పూర్తిస్థాయిలో పరిశీలించినపుడు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
దీనికి సంబంధించిన ఫొటోలను ఒకదాని పక్కన ఒకటి పెట్టి పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ సోషల్ మీడియా అకౌంట్లలో విపరీతంగా షేర్ చేసుకున్నారు. అలా చేసిన వారిలో బీజేపీ కర్ణాటక ప్రధాన కార్యదర్శి ఎన్. రవికుమార్, బీజేపీ మహారాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి రాజ్ దీక్షిత్, బీజేపీ గాంధీనగర్ మహిళా విభాగం కార్యదర్శి అనితా జయేష్ పాటిల్, బీజేపీ ఉత్తర ముంబై ప్రధాన కార్యదర్శి ఉమేష్ మొత్వానీ లాంటివాళ్లు ఉన్నారు. అయితే వీళ్లంతా ముందునుంచి చూసినవాళ్లే తప్ప అసలేం జరిగిందో వాళ్లలో ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు.
విజువల్ ట్రిక్
రాహుల్ నామినేషన్ దాఖలుచేస్తున్న ఫొటోను ముందునుంచి చూస్తుంటే ఎవరికైనా ఆయన కూర్చుని ఇస్తున్నట్లే ఉంటుంది. ఆయన పక్కనే తల్లి సోనియా గాంధీ కూడా కూర్చున్నట్లు ఉంటుంది. కానీ, రాహుల్ నామినేషన్ కార్యక్రమ వీడియోలు చూస్తే అసలు విషయం తెలిసింది. అమేథీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాహుల్ తన నామినేషన్ పత్రాలు దాఖలుచేశారు. అక్కడ కలెక్టర్ టేబుల్ ఎత్తు బాగా ఎక్కువగా ఉండటంతో దాని వెనక నిలుచున్న రాహుల్.. కూర్చున్నట్లు కనిపించింది. టేబుల్ ఉపరితలం రాహుల్ ఎదవరకు వచ్చింది. కానీ ఆయన నిలబడే ఉన్నారు. వెనక నుంచి చూస్తే స్పష్టంగా రాహుల్ నిల్చున్నారని తెలుస్తుంది.
రాహుల్ గాంధీ ఎన్నికల అధికారులను అగౌరవపరుస్తుంటే అమిత్ షా మాత్రం సగౌరవంగా నామినేషన్ పత్రాలు ఇస్తున్నట్లున్న ఆ ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రాహుల్ గాంధీని ఫొటోషాప్ లో మార్చిన ఫొటోలు, తప్పుడు వార్తాకథనాల క్లిప్పింగులతో టార్గెట్ చేస్తున్నారు.