(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కోల్కతా: ప్రాచీన కాలంలో హిందువులకు గొప్ప విజ్ఞానం అందుబాటులో ఉందని కథలు అల్లేందుకు పురాణాలను అడ్డం పెట్టుకునే మేధావుల జాబితాకు మరో పేరు వచ్చి చేరింది. మమతా బెనర్జీ ప్రభుత్వంతో చీటికి మాటికీ తగాదా పెట్టుకుని ఇప్పటివరకూ వార్తల్లోకి ఎక్కిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ ఇప్పుడు పురాణ గాధలకు కొత్త అర్ధాలు ఇవ్వడం ద్వారా సంచలనం సృష్టించారు.
ధన్కర్ కనిపెట్టిన రహస్యాలలో ఒకటేమిటంటే అర్జునుడి బాణాలకు అణ్వాస్త్రాల శక్తి ఉండడం. మహాభారత యుద్ధంలో కీలకమైన పాత్ర పోషించే పాండవ మధ్యముడు ధనుర్విద్యాపారంగతుడని మహాభారతంలో కవి వర్ణిస్తాడు. ఇప్పుడా అర్జునుడు బాణాల రూపంలో అణ్వాయుధాలు ప్రయోగించే వాడయిపోయాడు. బుధవారం 45వ తూర్పు భారత సైన్స్ ఫెయిర్లో ప్రసంగస్తూ ధన్కర్ మరికొన్ని రహస్యాలు కూడా విప్పి చెప్పారు.
1910 లోనో 1911లోనో విమానం కనిపెట్టారని చెబుతారు. మీరు మన రామాయణం చూడండి. మనకు అప్పుడే విమానం ఉన్నట్లు తెలుస్తుంది. సంజయడు మహాభారతం మొత్తాన్నీ దృతరాష్ట్రుడికి ఎలా వర్ణించాడు? మరి టివిలు లేవుగా? చూశారా, ఇండియాను పట్టించుకోకుండా ఉండడం ఇక ప్రపంచ దేశాలకు సాధ్యం కాదు అన్నారు ధన్కర్.