(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీ రాజకీయాల్లో మరోసారి బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా రెండు పార్టీలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి. బీజేపీతో కలిసి నడవాలని, వచ్చే నాలుగేళ్ళలో ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని జనసేన పార్టీ నిర్ణయించింది. రెండు పార్టీల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఇరు పార్టీల అధ్యక్షులు సంయుక్త ప్రకటన చేశారు. అయితే, రాజధాని అంశంపై ఇరు పార్టీలు ఎలా ముందుకు సాగుతాయి? అన్నది చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఏపీలో రాజధాని తరలింపుపై రగడ నడుస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనను బీజేపీ, జనసేన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
నిజానికి రాజధాని తరలింపు విషయాన్ని బీజేపీ పెద్దలకు సీఎం జగన్ ముందుగానే తెలిపారని ప్రచారం జరిగింది. కేంద్రం సూచనల మేరకు మూడు రాజధానుల ప్రకటన చేశారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం దీనిని స్పష్టత ఇవ్వడం లేదు. అటు కేంద్రం కూడా ఈ అంశంపై స్పందించింది లేదు. రాజధాని అంశాన్ని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇటీవలే పవన్ కల్యాణ్ ఆగమేఘాలపై ఢిల్లీ వెళ్లి.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా కలవడం, వెంటనే విజయవాడ కేంద్రంగా బిజెపి-జనసేన చర్చలకు తెరలేవడం చకచకా జరిగిపోయాయి. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో జనసేనకు బిజెపి అవసరం చాలా ఉంది. అలాగే బిజెపికి మరొక పార్టీ తోడు కూడా అనివార్యం. పదిశాతం ఓటు బ్యాంకు సాధించిన జనసేన తోడయ్యే అవకాశం రావడం, ఒక్క శాతం ఓటు కూడా సాధించలేని బిజెపికి కచ్చితంగా సానుకూల అంశమే. దీంతో రాజధాని విషయంలో కేంద్రం చెప్పినట్లు నడుచుకుంటాయా? లేదా సొంతంగా కార్యచరణ ప్రకటిస్తాయా ? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఏపీకి సంబంధించిన ఇరు పార్టీలు సంయుక్త నిర్ణయాలను ఒకసారి పరిశీలిస్తే..
“రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ-జనసేన పార్టీలు రాజకీయంగా కలిసి ముందు వెళ్ళాలి అని నిర్ణయించాయి. అనేక జాతీయ, రాష్ట్ర విషయాలపై కూలంకుషంగా చర్చించిన తరవాత రెండు పార్టీలు కలిసి ఒక అవగాహనకు వచ్చాయి. ప్రధాని మోదీ దేశానికి అందిస్తున్న సమర్థవంతమైన, అవినీతిరహిత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగల దృడమైన పాలనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. నవ్వాంధ్ర రాష్ట్రంలో నెలకొన్న లోపభూయిష్ట విధానాలను ఈ రెండు పార్టీలూ ఖండించాయి. 2014 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఏ విశ్వాసంతో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారో ఆ విశ్వాసాన్ని వమ్ము చేస్తూ ఇప్పటి ఈ ఆందోళనకర పరిస్థితికి అప్పటి ప్రభుత్వం కారణమైంది. అవినీతిలో కూరుకుపోయి, కుటుంబ నేపథ్యానికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు తిలోదకాలు ఇచ్చారు. మార్పును ఆకాంక్షించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 2019 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార పగ్గాలు అందించారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రస్తుత ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలకే పరిపాలనను పరిమితం చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది.
సుపరిపాలన కోసం ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ కనుక ఏ పార్టీ అధికారానికి వచ్చినా ప్రభుత్వ విధానాలు కొనసాగించాల్సిన బాధ్యత వర్తమాన ప్రభుత్వంపై ఉంటుంది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించింది. రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ అనేక ప్రజా కంటక నిర్ణయాలు చేస్తున్న సందర్భంలో పెట్టుబడులు రాక, అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయి రాష్ట్ర ప్రగతి కుంటుపడిన విషయాన్ని ఇరు పార్టీలు గుర్తించాయి. గతంలోని తెలుగుదేశం ప్రభుత్వం, వర్తమాన వైసీపీ ప్రభుత్వం కులం, కుటుంబ రాజకీయాలకు, పరస్పర దూషణలకు పరిమితం అవుతూ స్వలాభాపేక్షతో అవినీతిలో కూరుకుపోయి రాష్ట్ర ప్రగతిని కుంటుపరిచాయి. నవ్వాంధ్ర రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్ ఇచ్చే దిశగా జాతీయ దృక్పథం నిండిన ఈ కూటమి పని చేయాలని నిశ్చయించింది. విలువలతో కూడిన నాయకత్వాన్ని అందిస్తూ, యువతకు పెద్ద పీట వేయాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, పిపిఎల విషయాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్దఎత్తున అందిన ప్రోత్సాహకాల గురించి లోతుగా చర్చించారు. ఈ విషయాలపై కూలంకుషంగా చర్చించి ఒక అవగాహనతో భవిష్యత్ కార్యాచరణపై కూటమి ఒక నిర్ణయం తీసుకుంది. ప్రజా సమస్యలపై లోతుగా అవగాహన చేసుకొని వాటి పరిష్కారం కోసం ఇరు పార్టీలూ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. పరస్పర సమన్వయంతో ప్రజా సంక్షేమానికి, నవ్వాంధ్ర ప్రగతికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజల మన్ననలను చూరగొని 2024 సంవత్సరానికి అధికారంలోని రాగలమనే ధీమాను వ్యక్తం చేశాయి.”
మొత్తం మీద రాజధానిపై ఇరు పార్టీల కార్యాచరణ ఏమిటి? అన్నది మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతం రాజధాని అంశంపై అమరావతి ప్రాంత రైతులకు ఇరు పార్టీలు మద్దతు తెలిపాయి. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం రాజధానిని తరలిస్తే.. తదుపరి ఎలాంటి కార్యాచరణ ఉంటుంది అనేది చూడాలి.