(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇజ్రాయెలీ స్పైవేర్ ఉపయోగించి వాట్సాప్ ద్వారా మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసిన ఉదంతంపై దేశంలో హాట్ హాట్గా చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, అసమ్మతివాదులు, దౌత్యవేత్తలపై ఈ నిఘా పెట్టారు.
భారతదేశంలో కూడా హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులపై నిఘా పెట్టారు. వీరిపై నిఘా ఎందుకు?s వీరిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నవారు ఎవరు అన్న ప్రశ్నలపై చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర, చత్తీస్గఢ్, గోవాలో డజను మందికి పైగా హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులు మొబైల్స్ హ్యాక్ అయిన వారిలో ఉన్నారు. వీరందరూ దాదాపుగా భీమా కోరేగావ్, ఎల్గార్ పరిషద్ కేసులతో సంబంధం ఉన్నవారు.
ఈ విధంగా చూస్తే మహారాష్ట్రలోని ఫడ్నవీస్ ప్రభుత్వానికి వీరిపై నిఘా పెట్టాల్సిన అవసరం కనబడుతోంది. లేదా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కూడా అవసరం ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే భీమా కోరేగావ్ కేసులో నిందితుల లక్ష్యం ప్రధానమంత్రి నరేంద్ర మోదిని అంతమొందించడమేనని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తున్నది.
కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర హోంశాఖ దీనిపై స్పందించడం జరిగింది. ఇండియాలో ఎవరి ఫోన్పైనన్నా నిఘా పెట్టాలంటే దానికి ఒక పద్ధతి ఉందని మంత్రి అంటారు. అదే ఊపులో ఆయన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నిఘా పెట్టాయని కూడా ఆరోపించారు. హోంశాఖ స్పందన ఇంకా చిత్రంగా ఉంది. వాట్సాప్ ద్వారా భారతీయ పౌరుల గోప్యతపై దాడి జరిగిందన్న వార్తల లక్ష్యం ప్రభుత్వంపై బురద జల్లడమేనని హోంశాఖ వ్యాఖ్యానించింది. ఈ రెండు శాఖలు కూడా ఏదైనా ప్రభుత్వ ఏజెన్సీ స్పైవేర్ సంస్థ ఎన్ఎస్ఓ సేవలు కోరిందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.
నేరాలు, ఉగ్రవాదంపై పోరాడేందుకు ప్రభుత్వ నిఘా సంస్థలకూ, భద్రతా సంస్థలకు మాత్రమే స్పైవేర్ సేవలు అందిస్తామని ఇజ్రాయెలీ సంస్థ ఎన్ఎస్ఓ వెబ్సైట్లో రాశారు. అక్టోబర్ 23న ఆర్టిఐ కార్యకర్త సౌరవ్ దాస్ కేంద్ర హోంశాఖ నుంచి దీనికి సంబంధించిన సమాచారం కోరారు. స్పైవేర్ పెగాసస్ను ప్రభుత్వం కొనుగోలు చేసిందీ లేనిదీ, భవిష్యత్తులో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నదీ లేనిదీ చెప్పాలని ఆయన కోరారు. దీనికి కేంద్ర హోంశాఖ ఆ సమాచారం తమ దగ్గర లేదని సమాధానం ఇచ్చింది.