ఢిల్లీ: ఫేస్బుక్,వాట్సాప్లు ఫేక్ న్యూస్కు అడ్డాగా మారాయి. ముఖ్యంగా ఎన్నికలు వచ్చాయంటే ఈ మాధ్యమాలలో ఫేక్ న్యూస్ విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. ఈ నేథ్యంలో ఫేక్ న్యూస్కు అడ్డుకట్ట వేసేందుకు ఫేస్బుక్, వాట్సాప్లు కసరత్తు ముమ్మరం చేశాయి.
ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. దేశంలో దాదాపు 200మిలియన్ల యూజర్లు ఫేస్బుక్కు ఉన్నారు. ఈ నేపథ్యంలో తప్పుడు వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నది. ముఖ్యంగా మూకదాడులకు సంబంధించి అసత్య సమాచారం విస్తృతంగా వ్యాపించడంతో అలాంటి సమాచారానికి అడ్డుకట్టవేయాలని ప్రభుత్వం ఫేస్బుక్ యాజమాన్యాన్ని హెచ్చరించింది. దీంతో అప్పటి నుంచి ఫేస్బుక్ అసత్యవార్తల అడ్డుకట్టకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఒకేసారి ఐదుగురు కన్నా ఎక్కువమందికి సందేశాలు పంపే వీలు లేకుండా నిబంధన విధించింది.
ఇక ఎన్నికల నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం వాట్సాప్ను హెచ్చరించడంతో ఫేక్ న్యూస్ అడ్డుకట్టకు చర్యలు ప్రారంభించింది. అసత్యవార్తలు ప్రచారం కాకుండా అడ్డుకట్టవేసేందుకు ‘చెక్ పాయింట్ టిప్లైన్’ పేరుతో సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. మనకు వచ్చే సందేశాలపై ఏమాత్రం అనుమానం ఉన్నా చెక్పాయింట్ టిప్లైన్ (+91 96430 00888)కు తెలియజేయవచ్చు.
ప్రోటో(PROTO) అనే సంస్థ ఆవిష్కరించిన టిప్లైన్ సేవల ద్వారా ఎన్నికల సమయంలో వాట్సాప్లో చక్కర్లు కొట్టే వదంతులు, అసత్య వార్తలను సులభంగా తెలుసుకోవచ్చు. అనుమానాస్పద సందేశాలను టిప్లైన్ ద్వారా నివేదిస్తే ప్రోటోకు చెందిన కేంద్రం ఆ సందేశాన్ని తనిఖీ చేసి, అది నిజమైనదో కాదో చెబుతుంది.
‘నిజం.. అబద్ధం.. తప్పుదోవ పట్టించేది.. వివాదాస్పదమైంది.. తమ పరిధిలో లేనిది’ ఇలా కేటగిరీల వారీగా సమాచారానికి సంబంధించిన విషయాన్ని టిప్లైన్ సెంటర్ వెల్లడిస్తుంది. చిత్రాలు, వీడియో లింక్లు, టెక్ట్స్ రూపంలో ఉన్న సమాచారం దేన్నైనా ఈ కేంద్రం విశ్లేషించి చెబుతుంది. ఇంగ్లిష్తో పాటు, హిందీ, తెలుగు, బెంగాలీ, మలయాళం భాషల్లోని సందేశాలను ఇది క్రోడీకరించగలదు.