అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బుధవారం ఈ శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2004నుండి 2009 వరకూ మాత్రమే రాష్ట్రం అన్ని రంగాల్లో వృద్ధి చెందిందని చెప్పారు. ఆ కాలంలో 12శాతం వృద్ధి రేటు ఉందని బుగ్గన అన్నారు.
ఆంధ్రప్రదేశ్కు 2014-2019 బ్యాడ్ పీరియడ్గా బుగ్గన అభివర్ణించారు. విభజన కష్టాలకు తోడు ప్రభుత్వ పరిపాలన కూడా ప్రజలు అనుకున్నట్లుగా జరగలేదని బుగ్గన ఆరోపించారు.
గత ప్రభుత్వం వ్యవసాయరంగం వృద్ధిరేటు పెరిగిందంటూ తప్పుడు లెక్కలతో అంచనాలు తయారు చేసిందని మంత్రి విమర్శించారు. చేపల పెంపకం పెరిగినంత మాత్రన వ్యవసాయ వృద్ధి రేటు పెరుగినట్లవుతుందా అని బుగ్గన ప్రశ్నించారు. 2014-17 మధ్య ఐదు శాతం వృద్ధి రేటు కనబడిందని బుగ్గన అన్నారు. ద్రవ్యోల్బణం జాతీయ స్థాయిలో తగ్గిందని బుగ్గన చెప్పారు. ఏపిలో మాత్రం వినియోగ ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని బుగ్గన అన్నారు. గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున అప్పులు చేశారని బుగ్గన విమర్శించారు. అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయని అన్నారు. గత ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిమితిని దాటి అప్పు చేసిందని బుగ్గన విమర్శించారు. రాష్ట్ర జిడిపిలో మూడు శాతం దాటి అప్పులు చేయకూడదని బుగ్గన అన్నారు. తలసరి ఆదాయం చూస్తే తెలంగాణ కంటే బాగా వెనుకబడి ఉన్నామని బుగ్గన పేర్కొన్నారు. మౌలిక రంగాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టలేదని బుగ్గన అన్నారు. రాష్ట్ర రెవెన్యూ లోటు 66వేల కోట్ల రూపాయలకు పెరిగిందని బుగ్గన తెలిపారు. తెలంగాణకు వచ్చినట్లు మన రాష్ట్రానికి పన్ను ఆదాయం లేదని బుగ్గన అన్నారు. గత ప్రభుత్వం ప్రత్యేక హోదాను నీరుగార్చి ప్యాకేజీని ఆహ్వానించిందని బుగ్గన పేర్కొన్నారు. ప్యాకేజీ ద్వారా చంద్రబాబు సర్కార్ తెచ్చింది ఏమీలేదని బుగ్గన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఏమాత్రం ఆలోచన చేయలేదని మంత్రి విమర్శించారు.
గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు వివిధ కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం చెల్లించింది కానీ వివిధ కార్పోరేషన్లకు 18వేల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చిందని మంత్రి తెలిపారు. అదే విధంగా వివిధ శాఖలకు సంబంధించి మూడు లక్షల 62వేల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చిందని మంత్రి చెప్పారు. అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, హోంగార్డులు, అవుట్ సోర్సింగ్, విద్యారంగం, హెల్త్, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖ కింద చెల్లించాల్సిన బకాయిలు భారీగా పెండింగ్లో ఉన్నాయని మంత్రి చెప్పారు.
2018-19 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు 15వేల కోట్ల రూపాయలు దాటిందని బుగ్గన అన్నారు.
ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితిని ఈ ప్రభుత్వం ధైర్యంగా ఎదుర్కొంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. మనవ వనరుల అభివృద్ధిపై ఈ ప్రభుత్వం దృష్టి సారిస్తున్నదని రాజేంద్రనాధ్ తెలిపారు.