(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక త్వరలో జరగనుంది. మునిసిపల్ ఎన్నికల తరువాత, తాను తప్పుకుంటానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు ఎవరవుతారన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. పీసీసీ పదవిపై ఆపార్టీలో గట్టి పోటీ నెలకొంది. పార్టీలోని సీనియర్ నేతలు తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఇప్పటీకే పార్టీ పెద్దలను కోరారు.
నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు దగ్గరగా ఉంటూ, కోదాడ, హుజూర్ నగర్ ప్రజల సమస్యల పరిష్కారానికి ఇకపై తాను కృషి చేస్తానని, పురపాలక సంఘాల ఎన్నికల తరువాత టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తానని ఇటీవల ఉత్తమ్ స్వయంగా వెల్లడించారు. దీంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. పీసీసీ చీఫ్ పదవి నుంచి ఉత్తమ్ తప్పుకుంటారని గత అసెంబ్లీ ఎన్నికలు అనంతరం నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. హుజూర్ నగర్ ఉపఎన్నిక తర్వాత ఉత్తమ్ ను తప్పిస్తారనే వార్తలు కూడా వినిపించాయి. అయినా పార్టీ అధిష్టానం మాత్రం ఇంకా ఉత్తమ్ నే కొనసాగిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన భారీ ర్యాలీ సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీ పెద్దలతో కొందరు నాయకులు చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ రాజీనామా అంశాన్ని తెరపైకి తెచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే, కాంగ్రెస్ అధిష్టానం రెండు, మూడు పేర్లను మాత్రమే పరిశీలిస్తోంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిల్లో ఒకరికి టీపీసీసీ చీఫ్ పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో మాస్ లీడర్ గా రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. యువతలో క్రేజ్ ఉండటంతో రేవంత్ కు పదవి దక్కుతుందని ఓ వర్గం, పార్టీ సీనియర్ నేత అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం లభిస్తుందని మరో వర్గం వాదిస్తోంది. అయితే, రేవంత్ అభ్యర్థిత్వంపై మాత్రం కొందరు నేతలు అడ్డుపడుతున్నట్టు సమాచారం. ఇక సౌమ్యుడిగా పేరున్న శ్రీధర్ బాబుకు అనుకూలంగా రాష్ట్రంలోని కొందరు సీనియర్ నేతలు లాబీయింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి పార్టీలో ఉత్తమ్, కుంతియాల వ్యవహార శైలిపై చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడి మార్చాలని గత కొంత కాలంగా వీహెచ్ లాంటి సీనియర్ నాయకుడు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో బీసీ వర్గానికి చెందిన నాయకుడినే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు.
ఇదిలాఉంటే.. ప్రస్తుతానికి కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ పదవిపై దృష్టిని సారించకపోవచ్చని తెలుస్తోంది. తొలుత ఏఐసీసీ ప్రక్షాళన జరగాల్సివుంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ తిరిగి ఎన్నిక అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని ఎంపీక చేస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణగాలో ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలపై కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆధారపడి ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్నికల అనంతరం ఉత్తమ్ రాజీనామా చేస్తే.. సీనియార్టీ, వాక్ చాతుర్యం, అధికార టీఆర్ఎస్ పై దీటుగా పోరాడే నేతనే కొత్త అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది.