(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవిగా ఎవరిని నియమిస్తారు ? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివాదాల కారణంగా ఛానల్ చైర్మన్ పదవికి నటుడు, వైసీపీ నేత ఫృథ్వీరాజ్ రాజీనామా చేశారు. దీంతో ఆ పదవి ఎవరికి దక్కొచ్చనే దానిపై వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పృథ్వీ వ్యవహారం కారణంగా ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని భావిస్తున్న అధికార పార్టీ… ఈసారి ఈ పదవికి ఎంపిక చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. వివాదాలకు తావులేని వ్యక్తిని ఈ పదవిలో నియమిస్తేనే బాగుంటుందని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఎస్వీబీసీ చైర్మన్ రేసులో పలువురి ప్రముఖుల పేర్లు సీఎం జగన్ పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ యాంకర్ స్వప్న, సినీ దర్శకుడు శ్రీనివాసరెడ్డిలో ఎవరో ఒకరికి ఈ పదవి దక్కే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఇద్దరూ సీఎం జగన్ కుటుంబానికి సన్నిహితులే కావడంతో… వీరిలో ఎవరిని ఈ కీలక పదవి వరిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే వీరిలో ప్రస్తుతం ఎస్వీబీసీ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న దర్శకుడు శ్రీనివాసరెడ్డి వైపు జగన్ మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు ఈసారి ఎస్వీబీసీ చైర్మన్ ఎంపిక విషయంలో జగన్తో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. ఛైర్మన్ రేసులో ఉన్న ఇద్దరూ డైరెక్టర్లే. దీనిపైన సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఇద్దరిలో ఒకరి పేరు వైపే ముఖ్యమంత్రి మొగ్గు చూపుతారని తెలుస్తోంది.
పార్టీ కోసం పని చేస్తూ..విధేయుడిగా వ్యవహరించిన పృథ్వీ..ఎస్వీబీసీ ఛానెల్లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినితో ఫోన్లో సాగించిన సంభాషణ ఇప్పుడు కలకలం రేపింది. దీంతో ఆయన ఎస్వీబీసీ పదవికి రాజీనామా చేయటంతో ఇప్పుడు పార్టీ నేతకు ఈ పదవి ఇస్తారా ? లేక ప్రస్తుతం అందులో పని చేస్తున్న వారికే ప్రాధాన్యత ఇస్తారా? అనేది సస్పెన్స్ గా మారింది. పృథ్వీ రాజీనామా చేయగానే రెండు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. రేసులో ఉన్న ఇద్దరూ ప్రస్తుతం ఎస్వీబీసీలో డైరెక్టర్లుగా ఉన్నారు. ఒకరు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కాగా.. మరొకరు తెలుగులో మీడియాలో పేరుగాంచిన యాంకర్ స్వప్న. దీంతో ఈ ఇద్దరిలో ఒకరికి డైరెక్టర్ పదవితో పాటు చైర్మన్ పదవిని కూడా కట్టబెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇద్దరూ కావాల్సిన వారే కావటం..ఇద్దరూ ఇప్పుడు ఎస్వీబీసీ డైరెక్టర్లు ఉండటంతో ముఖ్యమంత్రి తుది నిర్ణయం ఎవరికి వరంగా మారుతుందనేది ఆసక్తికరంగా మారింది.