తెలంగాణ శాసనమండలిలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గులాబీ బాస్, ముఖ్యమంత్రి కెసిఆర్ అభ్యర్థులను ఎంపిక చేయనుండటంతో అప్పుడే లాబీయింగ్ లు మొదలు అయ్యాయి. టి ఆర్ ఎస్ సీనియర్ నేత నాయిని నర్శింహరెడ్డి, కర్నె ప్రభాకర్ ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తి అవ్వగా, ఎమ్మెల్సీ రాములు నాయక్ ఎన్నికలకు ముందే పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. ఖాళీ అయిన ఈ మూడు స్థానాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారని వార్తలు వస్తుండటంతో ఆశావహా టి ఆర్ ఎస్ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడి అవుతున్నారు.
ఖాళీ అయిన ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఎమ్మెల్సీ స్థానాలను ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది అంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎమ్మెల్సీఅభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు అన్న టాక్ వినపడుతున్నది. సెప్టెంబర్ ఏడవ తేదీ నుండి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలలోపుగానే కెసిఆర్ ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటిస్తారని సమాచారం. పదవీ కాలం పూర్తి అయిన నాయిని నర్శింహరెడ్డి, కర్నే ప్రభాకర్ మళ్లీ కొనసాగించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరికి మళ్లీ కెసిఆర్ ఛాన్స్ ఇస్తారా లేక సీనియర్ నాయకులను ఎంపిక చేస్తారా అనే దానిపై గులాబీదళంలో ఊహగానాలు సాగుతున్నాయి.
గత ఎన్నికల్లో ఓటమి పాలైన తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, మధుసూధనాచారి వంటి సీనియర్ నేతలు ఎమ్మెల్సీ అభ్యర్థుల రేసులో ఉన్నారు. త్వరలో జి హెచ్ ఎం సి ఎన్నికలు కూడా జరుగనున్న నేపథ్యంలో కెసిఆర్ తనకు అప్తుడైన తుమ్మల నాగేశ్వరరావుకు అవకాశం కల్పించవచ్చనే మాట కూడా వినబడుతోంది. ఇక సీనియర్ నేత నాయిని నర్శింహరెడ్డిని మళ్లీ కొనసాగించే అవకాశం ఉందా లేదా అన్నదానిపై కూడా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన అల్లుడికి అభ్యర్థిత్వం ఖరారు చేయాలని కెసిఆర్ ను నాయని కోరినా ఆయన అభ్యర్థనను తిరస్కరించారు కేసిఆర్. రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం నాయని ప్రయత్నించినా చుక్కెదురైంది. టి ఆర్ ఎస్ ఆవిర్భావం నుండి నాయని కెసిఆర్ వెంటే ఉన్నారు. కెసిఆర్ మనసులో ఎవరు ఉన్నారు, ఎవరెవరికి అవకాశం కల్పించనున్నారనే దానిపై పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చ జరుగుతుండగా పలువురు నేతలు లాబీయింగ్ లు షురూ చేశారంట. పదవులు కైవశం చేసుకునే ఆ త్రిమూర్తులు ఎవరో మరి కొద్ది రోజుల్లో తేలనుంది.