NewsOrbit
టాప్ స్టోరీస్

హరేన్ పాండ్య హత్య కేసు ఎందుకు తిరగదోడాలి?

సోహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ. 

గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసుని తిరిగి విచారించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద ఉత్తర్వులని సుప్రీం కోర్టు వాయిదా వేసింది. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అయ్యే వరకూ పాండ్య హోంమంత్రిగా ఉన్నారు. తర్వాత మోదీ ఆయనను వేరే అప్రాధాన్య శాఖకు  మార్చారు.

2018 నవంబర్ లో బయటకు వచ్చిన సాక్ష్యం ఒకటి ఈ వ్యాజ్యం దాఖలు చెయ్యడానికి దారి తీసింది. సోహ్రాబుద్దీన్ షేక్, కౌసర్ బీ, తులసీరాం ప్రజాపతి, ఈ ముగ్గురూ పోలీసు కస్టడీలో మృతి చెందిన కేసులో ప్రాసిక్యూషన్ సాక్షి అయిన ఆజం ఖాన్ ట్రయల్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో కొత్త సమాచారం బయటపడింది. పాండ్యను హత్య చేయాలన్న ఆదేశాలు గుజరాత్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి డి.జి.వంజర నుంచే వచ్చినట్లు సోహ్రాబుద్దీన్ తనకి చెప్పాడని ఆతను ఆ వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

2003 మార్చి 26 ఉదయాన అహ్మదాబాద్‌లో పాండ్య తన కారులో శవమై కనిపించారు. దీనికి సంబంధించి సి.బి.ఐ. పన్నెండు మంది మీద అభియోగ పత్రం దాఖలు చేసింది. వారిలో అస్ఘర్ ఆలీ అనే నిందితుడు పాండ్యాపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు.

గుజరాత్ లోని ట్రయల్ కోర్టు 2007లో ఆ హత్యకి సంబంధించి మొత్తం పన్నెండు మందినీ దోషులుగా నిర్ధారించింది. కానీ 2011లో హైకోర్టు వారందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. సిబిఐ దర్యాప్తు అంతా ఉద్దేశపూర్వకంగా, తప్పుడుగా జరిగిందని హైకోర్టు పేర్కొన్నది. ఆ దర్యాప్తునకు నాయకత్వం వహించిన సిబిఐ అధికారి వై.సి.మోదీ ఈ రోజు జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) అధిపతిగా ఉన్నారు.

హైకోర్టు తీర్పుని సి.బి.ఐ. సుప్రీం కోర్టులో సవాలు చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ వినీత్ శరణ్‌ల ధర్మాసనం ముందు ఈ కేసుకి సంబధించిన వాదోపవాదాలు క్రితం నెల ముగిసాయి.

మంగళవారం నాడు ఇదే ధర్మాసనం ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్, ఆయన తనయుడు ప్రశాంత్ భూషణ్‌ల వాదనలు విన్నది. కేంద్ర ప్రభుత్వం తరుపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసు పునర్విచారణ అనవసరం అని మెహతా వాదించారు.

సోహ్రాబుద్దీన్ కేసులో ఆజంఖాన్ ట్రయల్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం హరేన్ పాండ్య కేసుకి కీలకంగా మారింది.

నేరస్థుడు అయిన సోహ్రాబుద్దీన్‌ని, ఆయన భార్య కౌసర్‌ బీని పాండ్య హత్య జరిగిన రెండు సంవత్సరాలకి, 2005లో ఎదురుకాల్పులలో హతమార్చారు. సోహ్రాబుద్దీన్  కేసులో ముద్దాయిగా బి.జె.పి. అధ్యక్షుడు అమిత్ షా ని అరెస్టు చేశారు. గుజరాత్‌లో ఓ ముఖ్యమైన పోలీసు అధికారి డి.జి.వంజరని కూడా అరెస్టు చేశారు.

సోహ్రాబుద్దీన్ కేసులో ఆజం ఖాన్ ప్రాసిక్యూషన్ సాక్షి. మొన్న డిసెంబర్‌లో జరిగిన కోర్టు విచారణలో, పాండ్యని చంపడానికి వంజర కాంట్రాక్ట్ ఇచ్చాడని సోహ్రాబుద్దీన్ తనకి చెప్పినట్లు అతను తెలిపాడు. తన సహచరులు తులసీరాం ప్రజాపతి ఇంకొందరు ఆ కాంట్రాక్ట్ ప్రకారం పాండ్యని హతమార్చారని సోహ్రాబుద్దీన్ చెప్పాడు.

“‘గుజరాత్‌కు చెందిన హరేన్ పాండ్యని చంపడానికి నాకు, నయీం ఖాన్‌కు, షాహిద్ రాంపురికి కాంట్రాక్ట్ వచ్చింది, చంపేశాము’ అని మేము మాట్లాడుకుంటున్నప్పుడు సోహ్రాబుద్దీన్ చెప్పాడు. నాకు బాధ వేసి మంచి మనిషిని చంపేసావు అన్నాను. తనకి ఈ కాంట్రాక్ట్ వంజర ఇచ్చాడని  అప్పుడు సోహ్రాబుద్దీన్ చెప్పాడు.” అని ఆజం ఖాన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

ఇదంతా కూడా తను 2010లోనే సి.బి.ఐ కి చెప్పానని, కానీ తనను నోరు మెదపకుండా ఉండమని చెప్పారని ఆజం ఖాన్ కోర్టుకి తెలిపాడు. ఈ ఆదేశాలు అన్నీ “పై నుండి” వచ్చాయన్న ఆజం ఖాన్ వ్యాఖ్యలని కోర్టు రికార్డుల నుండి తొలగించమని న్యాయమూర్తి ఆదేశించారు.

సోహ్రాబుద్దీన్ ఎదురుకాల్పుల కేసులో ముద్దాయిలు అందరూ డిసెంబర్ నెలలో నిర్దోషులుగా విడుదల అయ్యారు.

పాండ్యా హత్య కేసులో ముద్దాయిలందరినీ గుజరాత్ హైకోర్టు 2011లో నిర్దోషులుగా విడుదల చేసిన తరువాత దీనితో పాటు, మరికొంత సరికొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం ఆ కేసు మీద ప్రభావం చూపగలదు.

ఇదంతా కూడా న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్ బహిరంగ కోర్టులో న్యాయమూర్తుల దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కూడా పేర్కొనటం జరిగింది.

రాజకీయ కుట్రలో భాగంగా పాండ్య హత్య జరిగినట్లు తనని విచారిస్తున్న సి.బి.ఐ అధికారులతో వంజర చెప్పారని టైమ్స్ ఆఫ్ ఇండియా 2013లో ప్రచురించింది.

2016లో పాత్రికేయురాలు రాణా అయ్యుబ్ గుజరాత్ ఫైల్స్ పేరుతో ఒక పుస్తకం ప్రచురించారు. సి.బి.ఐ కన్నా ముందు ఈ కేసుని విచారించిన గుజరాత్ పోలీసు అధికారి వై.ఏ.షేక్‌తో తన సంభాషణని అందులో పొందుపరిచారు. ఆయన కూడా దర్యాప్తులో నిజాయితీ లేదని, ఇది రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు. పాండ్యాని హతమార్చే కుట్రలో వంజర భాగస్వామి అని పేర్కొన్నారు.

జస్టిస్ అరుణ్ మిశ్రా కోర్టులో ఆ పుస్తకం కాపీ అడిగి తీసుకుని దానిని పరిశీలించారు.

క్రితం నెల ది వైర్ తో మాట్లాడుతూ ఈ కేసుని పునర్విచారించాలని వై.ఏ.షేక్ అన్నారు.

ఈ కేసు దర్యాప్తులో వంజర క్రియాశీలకంగా లేకపోయినా ఆ నేరం జరిగిన ప్రదేశంలోనూ, పోస్ట్ మార్టం జరిగిన గదిలోనూ ఉన్నారు, గుజరాత్ పోలీసులు తీసిన చిత్రాలలో అది నమోదు అయ్యింది అని క్రితం నెల ది వైర్  ప్రచురించింది.

కేసు పునర్విచారణకు ప్రాతిపదికగా వార్తా కథనాలని ఉటంకించటం పట్ల జస్టిస్ అరుణ్ మిశ్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని ఉచితానుచితాల గురించి భూషణ్‌ని ప్రశ్నిస్తూ, ఈ విషయానికి సంబంధించి తానే ఏదో ఒక నిర్ణయానికి రావాలి అని అన్నారు.  దానికి ప్రతిగా భూషణ్ కోర్టులు వార్తా కథనాలని సుమోటో గా తీసుకుని కేసులని ప్రారంభించిన ఉదాహరణలను ఎత్తి చూపించారు.

కోర్టులో వార్తా కథనాలని ఉటంకించటం గురించే కాకుండా ఈ కేసు వెయ్యటానికి పాటించిన ప్రక్రియ గురించి కూడా ఇద్దరు భూషణ్‌లని జస్టిస్ మిశ్రా ప్రశ్నించారు.

క్రిమినల్ కేసులో అప్పీలు సుప్రీం కోర్టులో తన ముందు ఉండగా పునర్విచారణ కోరుతూ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చెయ్యవలసిన అవసరం ఏముందని వాదనలు మొదలయిన వెంటనే భూషణ్‌ను న్యాయమూర్తి అడిగారు.

సి.బి.ఐ సవాలు చేసింది కేవలం వాళ్ళని నిర్దోషులుగా ప్రకటించటం పైనే కాగా, తను కేసు దర్యాప్తును తిరగదోడాలని కోరుతున్నట్లు ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. వాదోపవాదాల చివరలో అప్పీలుపై తీర్పు ఇచ్చే ముందే ఈ కేసు పునర్విచారణకి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పారు.

కానీ జస్టిస్ మిశ్రా పిటిషన్ దాఖలు ప్రక్రియకు సంబంధించి భూషణ్ ని తరచి తరచి ప్రశ్నిస్తూనే ఉన్నారు. కొత్తగా బయటపడిన సాక్ష్యధారాలను ఈ అప్పీలుకు జోడించడం కరెక్టు అవుతుంది తప్ప సరికొత్త కేసుకు ప్రాతిపదిక కాదని తనకి తానే చెప్పుకున్నారు.

పిటిషనర్లకి ఈ వ్యాజ్యం దాఖలు చెయ్యటానికి “ఎటువంటి హక్కు” (Locus Standi) లేదని కేంద్రం తరుపున వాదనలు వినిపించిన తుషార్ మెహతా పేర్కొన్నారు.

దీనికి శాంతి భూషణ్ జవాబిస్తూ, ‘ఒక క్రిమినల్ నేరం జరిగినపుడు అది సమాజానికి వ్యతిరేకంగా జరిగినట్లు. కాబట్టి సమాజ శ్రేయస్సు కోసం నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఎవరైనా కోరుకోవచ్చు’ అని పేర్కొన్నారు.

అనూ భుయాన్ 

‘ది వైర్’ వెబ్‌సైట్ సౌజన్యంతో

author avatar
Siva Prasad

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment