కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గేటు మూసివేయడంపై ఆరాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు క్లియర్ కాని కారణంగా బెంగాల్ అసెంబ్లీని రెండు రోజుల పాటు వాయిదా వేశారు. అయితే, తాను వస్తున్న సమయంలో వీవీఐపీలకు ఉద్దేశించిన గేటు మూసివేశారని, తెరిచి ఉన్న మీడియా గేటు ద్వారా తాను లోపలికి వెళ్లాల్సి వచ్చిందని గవర్నర్ మండిపడ్డారు. అసెంబ్లీ గేట్లను ఎందుకు మూసివేశారని ? ప్రశ్నించారు. అసెంబ్లీ సెక్రటేరియట్ ఏడాదంతా పనిచేస్తుందని, అసెంబ్లీలో సమావేశాలు లేనంత మాత్రాన దాన్ని మూసి వేయాల్సిన అవసరం లేదన్నారు. తాను చారిత్రక కట్టడాన్ని సందర్శించి లైబ్రరీని పరిశీలించేందుకు వచ్చానని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరగని సమయంలోనూ సెక్రటేరియట్ అంతా యథావిధిగా పనిచేయాలని చెప్పారు.
గురువారం అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ కాన్వాయ్ ఒకటో నెంబర్ గేట్ గుండా లోపలకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆ గేటుకు తాళం వేయడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం రెండో నంబర్ గేట్ నుంచి నడుచుకుంటూ లోపలకు వెళ్లారు.
మరోవైపు తాను లైబ్రరీని సందర్శించేందుకు వస్తున్నట్లు బుధవారం అసెంబ్లీ స్పీకర్ బిమాన్ బెనర్జీకి గవర్నర్ లేఖ రాశారు. అయితే, స్పీకర్ సభను రెండు రోజుల పాటు వాయిదా వేయడంతో శుక్రవారం తిరిగి అసెంబ్లీ ప్రారంభం కానుంది. ‘ సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపించాం. అవి ఇంకా గవర్నర్ ఆమోదం పొందలేదు. కాబట్టి సభ రెండు రోజులపాటు వాయిదా వేస్తున్నాం ’ అని మంగళవారం స్పీకర్ పేర్కొన్నారు.
కాగా, పశ్చిమబెంగాల్ లో గవర్నర్ జగదీప్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య వివాదం నడుస్తోంది. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారంటూ మమతా బెనర్జీ ఇటీవలి కాలంలో గవర్నర్ పై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రోజు జరిగిన ఘటనతో వీరి మధ్య అగాధం మరింత పెరిగినట్టయింది.
#UPDATE West Bengal Governor Jagdeep Dhankar enters state Assembly from gate number 2 as gate number 1 of the Assembly was closed. https://t.co/c4nUq1Pj2J pic.twitter.com/DkJyCWCRy7
— ANI (@ANI) December 5, 2019