(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
తెలంగాణలో గులాబీ జెండాకు అసలు హక్కుదారులు ఎవరు? అనే చర్చ కొనసాగుతోంది. టీఆర్ఎస్ పార్టీకి తామే ఓనర్లమని.. భిక్షమడుక్కుంటే తనకు మంత్రి పదవి రాలేదని మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనమైయ్యాయి. టీఆర్ఎస్ పార్టీలో వివాదరహితుడిగా పేరున్న ఈటల బహిరంగంగా కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గులాబీ జెండాపై ఆయన చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారి తీశాయి.
ఈటల.. తన మనసులోని ఆవేదనని వెళ్లగక్కారా..లేక తనపై ఇటీవల జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండించారా అన్నదానిపై చర్చ నడుస్తోంది. నిజానికి 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికే ఈటలకు టీఆర్ఎస్ అధిష్ఠానానికి మధ్య దూరం పెరిగిందని వాదన ఉంది. టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో ఈటల రాజేందర్కు చోటు ఉండదని ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే పార్టీతో రాజేందర్ సంబంధాలు దెబ్బతిన్నాయన్న వాదనలు వినిపించాయి. కానీ సామాజిక సమీకరణాలు, పార్టీలో సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఈటలకు మంత్రిగా అవకాశం దక్కింది.
అయితే, పార్టీలో ఒక వర్గం ఎప్పటికప్పుడు రాజేందర్ను టార్గెట్ చేస్తూ వచ్చింది. ఓ సెక్షన్ మీడియాలో గత కొద్దిరోజులుగా ఈటలకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి. మంత్రి వర్గం నుంచి తొలగిస్తారని, ఈటలపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. దీంతో అసహనానికి గురైన రాజేందర్.. పరోక్షంగా అధిష్ఠానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తాడో పేడో తేల్చుకునే దిశగా సంచలన కామెంట్స్ చేశారు. అయితే టీఆర్ఎస్ అధినాయకత్వం రంగంలోకి దిగి పరిస్ధితిని అదుపులోకి తీసుకురావడంతో.. రాజీవాతావరణం ఏర్పడింది.
ఇదిఇలా ఉంటే.. గులాబీ జెండాకు సీఎం కేసీఆర్ ఒక్కరే ఓనర్ అని మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు అన్నారు. గులాబీ జెండాను కేసీఆరే తయారు చేశారన్నారు. ఈటల రాజేందర్ ది ముగిసిపోయిన అంశమని… ఆయన పదవికి కూడా ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే, గులాబీ జెండాకు కేసీఆర్ ఒక్కరే బాస్ అని చెప్పడంతో ఈటలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ వివాదం ఇక్కడితో సమసిపోతుందా లేక పార్టీ ఉన్న కొంతమంది సీనియర్లు ఇదే అంశంపై ధిక్కార స్వరం వినిపిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది.