రాయ్ బరేలి: అవసరమైతే తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా ఢీకొంటానని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా సూచనప్రాయంగా చెప్పారు. తన తల్లి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలు కోరినపుడు ‘వారణాసి నుంచి ఎందుకు వద్దు’ అని ఆమె వారితో వ్యాఖ్యానించారు. నియోజకవర్గ ప్రజలను కలుసుకోలేకపోతున్నందుకు తన తల్లి ఆందోళనగా ఉన్నారని చెప్పినపుడు, మీరే పోటీ చేయాలని కార్యకర్తలు ప్రియాంకను కోరారు. అప్పుడే ఆమె ఈ మాటలు అన్నారు. నియోజకవర్గంలో పనులను తాను చూసుకుంటానని, అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తల్లికి చెప్పానన్నారు. అయితే, పార్టీ చెబితే పోటీ చేయడానికి కూడా సిద్దంగానే ఉన్నానని ఇంతకుముందు కూడా ప్రియాంక అన్నారు. వారణాసి మాట ఎటుంచినా.. తనకు పోటీ చేయాలనే ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. అమేథిలో తన తమ్ముడి తరఫున ప్రచారం చేస్తూ ఈ మాట అన్నారు.
తూర్పు యూపీ ఇన్ చార్జిగా ప్రియాంకను నియమించినపుడే ఆమె రాయ్ బరేలి నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. సోనియా రిటైర్ అవుతారని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలోనే రాయ్ బరేలికి సోనియా పేరు వచ్చింది. ప్రియాంక పోటీ చేస్తే పార్టీ తలరాత మారుతుందని కార్యకర్తలు అంటున్నారు. అచ్చం నాయనమ్మ ఇందిరలాగే ఉండే ప్రియాంక సామాన్యులను ఆకట్టుకుంటారని చెబుతున్నారు. తరచు మీడియాతో మాట్లాడటం, బీజేపీపై విమర్శలు చేయడం, వారణాసిలో గంగానదిలో ప్రచారం చేయడం ద్వారా ప్రియాంక తరచు వార్తల్లో ఉంటున్నారు. యూపీలో మొత్తం 7 దశల్లోనూ పోలింగ్ జరగనుంది.