NewsOrbit
టాప్ స్టోరీస్

మండలి రద్దుకు కేంద్రం సహకరిస్తుందా?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఏపీలో శాసనమండలి రద్దు అంశం కాక రేపుతోంది. అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి రద్దుకి సీఎం జగన్‌ సంకేతాలు ఇచ్చారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ కీలక బిల్లుల తిరస్కరణతో అసహనంతో రగిలిపోతున్న వైసీపీ ప్రభుత్వం.. మండలి రద్దుపై నిర్ణయానికి వచ్చేసిందని ప్రచారం జోరుగా సాగుతోంది. రద్దు నిర్ణయం నిజమైతే కేంద్రం సహకరిస్తుందా ? తక్కువ సమయంలోనే పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదించేలా చొరవ తీసుకుంటుందా ? అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి.

రాజధాని బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపించిన మీదట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మండలి రద్దు దిశగా అడుగులు వేస్తోంది. మండలిలో చోటు చేసుకున్న పరిణామాలపై జనవరి 23న ఏపీ అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు శాసన మండలిని రద్దుచేస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మండలిలో విపక్ష సభ్యులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకపోవగా.. ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని విమర్శలు గుప్పించారు. అలాంటి మండలి అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి, శాసన మండలి సభా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వలేని సభ అనవసరమని ఆయన వ్యాఖ్యానించారు. మండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపాదిస్తున్నానని మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు.

ప్రజలకు మేలు చేసే విషయంలో ప్రభుత్వానికి సలహలు సూచనలు ఇవ్వాల్సిన మండలి.. చట్టాలకు నిరోధంగా మారిందని సీఎం జగన్ అంటున్నారు. చట్టం, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ మండలి మనకు అవసరమా? అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ వ్యాఖ్యలతో దాదాపు శాసన మండలి రద్దు ఖాయంగా కనిపిస్తుంది. ఇదే నిజమైతే ప్రభుత్వం తదుపరి ఏం చేయబోతుంది ? రద్దుకి ఎంత సమయం పడుతుంది ? అన్న ప్రశ్నలు ఆసక్తిరేపుతున్నాయి. మండలిని రద్దు చేయాలంటే ముందుగా శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టాలి. సభ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపాలి. అక్కడ ముందుగా లోక్‌సభలోనైనా రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టొచ్చు. రెండు సభల్లో రద్దు తీర్మానం ఆమోదం పొందితే ఫర్వాలేదు. రెండింటిలో ఏ ఒక్క సభ తిరస్కరించినా బిల్లు మళ్లీ రాష్ట్రానికి చేరుతుంది. ఇక్కడ మరోసారి శాసనసభలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ కేంద్రానికి పంపించాలి. ఒకవేళ అప్పుడు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందితే అక్కడి నుంచి రద్దుకు సంబందించిన ఆమోదప్రతి రాష్ట్రపతికి చేరుకుంటుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఆ క్షణం నుంచి పూర్తిగా ఏపీ శాసన మండలి రద్దు అవుతుంది.

వైసీపీకి శాసన సభలో భారీ మెజారిటీ.. మండలిలో మాత్రం తక్కువ మెజారిటీ. అసెంబ్లీ వైసీపీ బలం 151 అదే మండలిలో కేవలం 9 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీని కారణంగా సీఎం జగన్ పలు బిల్లులను ఆమోదించుకోలేకపోతున్నారు. మొన్నటికి మొన్న ఇంగ్లిష్ మీడియం బిల్లును తిప్పి పంపిన మండలి.. జనవరి 22 పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్‌డిఎ రద్దు లాంటి రెండు కీలక బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపింది. మండలిలో బిల్లులు ప్రవేశపెట్టడానికే రూల్ 71 కింద అవరోధం కల్పించి వైసిపికి చెమటలు పట్టించిన టిడిపి తన పంతం నెగ్గించుకున్నది. మండలిలో టీడీపీ బలంగా ఉండటమే దానికి ప్రధాన కారణం.

అయితే, ఈ పరిస్థితి సీఎం జగన్‌కే కాదు గతంలో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌కు కూడా ఎదురైంది. అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వానికి శాసనసభలో పూర్తి మెజారిటీ ఉండేది. కానీ, మండలికి వచ్చే సరికి మాత్రం కాంగ్రెస్‌దే హవా కొనసాగింది. టీడీపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు అడ్డు తగులుతూ వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఅర్ అసెంబ్లీలో తీసుకుంటున్న నిర్ణయాలకు మండలి పెద్దలు పదే పదే అడ్డు వస్తుండడంతో ఆయన మండలి రద్దు నిర్ణయం తీసుకున్నారు. 1985లో ఆయన మండలిని రద్దు చేశారు. అప్పట్నుంచి ఆంధ్రప్రదేశ్ కు శాసనమండలి లేకుండా చాలా రోజులు నడిచింది. మళ్లీ తిరిగి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో సీఎం అయ్యేంత వరకు మండలి ఏర్పాటు కాలేదు. కాంగ్రెస్ నేతలకు పదవులు కల్పించాలనే ఉద్దేశ్యంతో శాసనమండలిని తిరిగి పునరుద్ధరించారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి కొలువుదీరింది. ఎన్టీఆర్‌కు వచ్చిన సమస్యే ఇప్పుడు జగన్‌కు ఎదురవుతోంది. అయితే, తన తండ్రి వైఎస్‌ఆర్ తిరిగి తీసుకొచ్చిన అదే మండలి ఇప్పుడు కుమారుడి, ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌ని ఇబ్బంది పెట్టడం గమనార్హం. ఇపుడు మళ్ళీ పదిహేనేళ్ల తరువాత పెద్దల సభ రద్దు చేస్తారనే ఊహాగానాలు ఉపందుకున్నాయి.

శాసనమండలిని ఏర్పాటు చేయడమే కాదు, రద్దు చేసే అధికారాన్ని కూడా రాజ్యాంగం శాసనసభలకే కల్పించింది. ఆర్టికల్‌ 169 (1) ప్రకారం శాసనసభ 2/3 వంతు మెజార్టీతో ప్రత్యేక తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తీర్మానాన్ని పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదించిన తర్వాత.. రాష్ట్రపతి సంతకంతో అమల్లోకి వస్తుంది. ఎన్టీఆర్‌ హయాంలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే మండలి రద్దు చేయగలిగారు. దీంతో జగన్‌ సర్కార్‌ మండలి రద్దుకి మొగ్గుచూపితే ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మండలి రద్దు నిర్ణయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్యను బట్టి ఉంటుంది. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంతో సయోధ్యగానే ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా కేంద్రంపై విమర్శలు చేసింది లేదు. ప్రస్తుతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. దీంతో రద్దుకి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని తెలుస్తోంది.

మరోవైపు ఏపీలో మూడు రాజధానుల అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేన.. ఇప్పుడు బీజేపీతో జత కట్టింది. అమరావతి విషయంలో రెండు పార్టీలు రాజధాని రైతులకు బాసటగా నిలుస్తున్నాయి. జగన్‌ సర్కార్‌పై గుర్రుగా ఉన్న పవన్‌.. ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో వైసీపీ సర్కార్ మండలి రద్దు నిర్ణయానికి పవన్‌ మోకాలడ్డుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిఇలా ఉంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలామంది పదవులు ఆశిస్తున్నారు. వాళ్లందర్ని సంతృప్తి పరచాలంటే ఖచ్చితంగా పదవులు కట్టబెట్టాల్సిందే. ఒక్క ఏడాది ఆగితే.. చాలా ఎమ్మెల్సీలు ఖాళీ అవుతాయి. ఆశావహులకు అవకాశాలు కల్పించొచ్చు. ఇంత మాత్రానికి రద్దుకి మొగ్గుచూపుతారా ? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఎమ్మెల్సీల్లో చాలామంది టీడీపీ సభ్యులే ఉన్నారు. ఒకవేళ రద్దు చేస్తే వాళ్లందరి పదవులు పోవడం ఖాయం. వాళ్లు యూటర్న్ తీసుకునేలా జగన్ మండలి రద్దు అంశాన్ని తెరపైకి తెచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై సోమవారం అసెంబ్లీ సమావేశంలో జరిగే చర్చపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

శాసన మండలి రద్దు ప్రాసెస్‌ నెలలో పూర్తి కావొచ్చు.. లేదంటే ఏడాది పట్టొచ్చు. ఇంత కాలం అని నిర్దిష్ట గడువేం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్యను బట్టి అది ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ పార్లమెంట్ ఆమోదం లభించకపోతే మాత్రం.. శాసన మండలి రద్దు కష్టమేనని చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైసీపీకి కేంద్రం సహకరిస్తుందా.. జగన్‌ ఆశిస్తున్నట్టు మండలి రద్దు బిల్లును ఉభయసభల్లో ప్రవేశ పెట్టి తక్కువ కాలంలో ఆమోదిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment