న్యూఢిల్లీ: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు తెలిపింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల పిటిషన్పై తీర్పు వచ్చే వరకు వాయిదా వేస్తామని ఈసీ పేర్కొంది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఈసీ తన నిర్ణయాన్ని సుప్రీం కోర్టుకు తెలిపింది. కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాల్సిందిగా అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రెండు రోజుల పాటు వాదనల విన్న జస్టిస్ ఎన్.వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 22కు వాయిదా వేసింది.
కర్ణాటకలో కాంగ్రెస్-జీడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీం కోర్టు తన తీర్పును వెలువరించాల్సి ఉంది. ఇటీవల మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 21 పోలింగ్, 24న ఫలితాలు వెలువడాల్సి ఉంది.