అమరావతి: ఎన్నికలలో ఓటమి చవిచూసి ప్రతిపక్షంలో కూర్చున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు రెండవ నెలలోనే విషమ పరీక్ష ఎదురవుతున్నది. ప్రజావేదిక కూల్చివేతకు అదేశాలు ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు పరీక్ష పెట్టారు.
ప్రజావేదికే అక్రమ కట్టడమైతే దానికన్నా కృష్ణానది ఒడ్డుకు మరింత దగ్గరున్న చంద్రబాబు నివాసం ఏమవ్వాలి? మంగళవారం కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఆ మాటే అన్నారు. ప్రజావేదిక ముమ్మాటికీ అక్రమ కట్టడమేనని జలవనరుల శాఖ ఇచ్చిన నివేదిక చూపుతూ, మాజీ ముఖ్యమంత్రి నివాసం ఉంటున్నది కూడా అక్రమ కట్టడమేనని అన్నారు.
ఇప్పుడు చంద్రబాబు ముందు ఉన్న ప్రశ్న ఏమంటే తాను ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలా లేక ప్రభుత్వం నోటీసు ఇచ్చేంతవరకూ అక్కడే ఉండాలా? కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా ముందు నుంచీ పోరాటం చేస్తున్న మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, చంద్రబాబే మర్యాదగా ఖాళీ చేస్తే బావుంటుందని అన్నారు.
ప్రజావేదిక ప్రభుత్వ ఆస్థి కాబట్టి ముఖ్యమంత్రి చెప్పిందే తడవు దానిని కూల్చిపారేశారు. కరకట్టపై ఉన్న మిగతా అక్రమ కట్టాడాలు ప్రయివేటు వ్యక్తుల ఆస్థులు. వాటిని కూడా తొలగించాలంటే చట్ట ప్రకారం నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ఆ నోటీసులకు భవనాల యజమానుల నుంచి సమాధానాలు రావాలి. తర్వాత ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఈలోపు ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. విషయం ఒకసారి లిటిగేషన్లో పడితే అది తేలడానికి ఎంత సమయం పడుతుందో!
అయితే అందరు ప్రయివేటు వ్యక్తుల లాగా మాజీ ముఖ్యమంత్రి కూడా కోర్టుకు వెళ్లగలరా? చంద్రబాబు ప్రతిష్టకు సంబంధించిన విషయం ఇది. ఆ భవనం తనది కాకపోయినా అక్రమ కట్టడమే అని చంద్రబాబు అంగీకరించక తప్పదు. అలాంటి కట్టడంలో నివాసాన్ని ఆయన ఎలా సమర్ధించుకోగలరు. ఎందుకొచ్చిన గొడవలే అని ఖాళీ చేస్తే జగన్కు అది ప్లస్ పాయింట్ అవుతుంది. మరి చంద్రబాబు ఏం చేస్తారు? ఆయన ఈ సంకట స్థితిని ఎలా తప్పించుకుంటారు?