ఘోర పరాజయంపై సీడబ్ల్యుసీ పోస్టుమార్టం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం ఎదురవడానికి కారణాలేంటో చర్చించేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యుసీ నేడు సమావేశం కాబోతోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేకుండా 52 స్థానాలకు పరిమితం కావడంతో.. అధ్యక్ష పదవికి రాజీనామా చేసే యోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలుస్తోంది. సీడబ్ల్యుసీలో యూపీయే చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఇలా 52 మంది ఉంటారు. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ భారీ స్థాయిలో దేశమంతా ప్రచారం చేసినా, గత సార్వత్రిక ఎన్నికల కంటే కేవలం 8 స్థానాలు మాత్రమే మెరుగుపడటం పట్ల రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. దానికితోడు ఉత్తరప్రదేశ్ లో తమ కుటుంబ కంచుకోట అయిన అమేథీలో స్వయంగా తాను ఓడిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
ఓటమికి నూరు శాతం బాధ్యత తనదేనని రాహుల్ గురువారం అన్నారు. తాను రాజీనామా చేస్తానా.. లేదా అన్న విషయం సీడబ్ల్యుసీలో తేలుతుందని చెప్పారు. అయితే, ఆయన రాజీనామా లేఖ సమర్పిస్తారని.. కానీ సీడబ్ల్యుసీ దాన్ని ఆమోదిస్తుందా లేదా అన్నది మాత్రం అనుమానమేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ తలరాతను మార్చాలని సోదరి ప్రియాంకను కూడా ప్రచారపర్వంలోకి పూర్తిస్థాయిలో దించారు. ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసి తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు అప్పగించారు. ప్రధాని మోదీ పోటీ చేసిన వారణాసి స్థానం ఆ ప్రాంతంలోనే ఉంది.
కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 52 స్థానాలకు పరిమితం కాగా, బీజేపీ మాత్రం ముందునుంచి చెబుతున్నట్లుగా ‘తీన్ సౌ పార్’.. 300 మార్కు దాటేసింది. ఉత్తరప్రదేశ్ లో పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని ఆ రాష్ట్ర నాయకుడు, మాజీ నటుడు రాజ్ బబ్బర్ గురువారం ట్వీట్ చేశారు. యూపీ కాంగ్రెస్ ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయని, తన విధులను సరిగా నిర్వర్తించలేనందుకు తనదే తప్పని ఆయన అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే లేనంత దారుణంగా 44 స్థానాలకు పడిపోవడంతో నాటి పార్టీ చీఫ్ సోనియా గాంధీ, ప్రచార కమిటీ సారథి, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరూ రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ రాజీనామాలను తిరస్కరించింది. కానీ ఈసారి మాత్రం నాయకత్వం విషయంలో పార్టీలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.
వరుసగా రెండోసారి సార్వత్రిక ఎన్నికలలో దారుణంగా ఓడిపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు వీరాభిమాని అయిన చరిత్రకారుడు రామచంద్ర గుహ ఈ పరిస్థితిపై శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇంకా రాజీనామా ఎందుకు చేయలేదన్నది విస్మయం కలిగిస్తోంది. రాజకీయ వ్యవహార జ్ఞానం, ఆత్మగౌరవం ఉంటే కాంగ్రెస్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి బహుశా ఆ రెండూ లేవు’’ అని ఆయన అన్నారు.