NewsOrbit
టాప్ స్టోరీస్

చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా!?

 ఈ ఇద్దరు నాయకుల మధ్య  సుహృద్భావం మళ్లీ సాధ్యమేనా?

సమకాలీన రాజకీయ నాయకుల్లో గొప్ప ధైర్యవంతుడెవరని అడిగితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేరు చెప్పేవాళ్లు ఎవరూ ఉండరేమో! ఆయన ఏమైనా కావచ్చేమో గానీ ధైర్యవంతుడు మాత్రం కాదు. పార్టీలో ఎదురయిన సమస్యలను కూడా ఏనాడూ ఆయన తెంపుగా తుంచలేదు. చంద్రబాబు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలలో మొదటిదీ చివరిదీ ఆనాటి ముఖ్యమంత్రి, తన మామ అయిన ఎన్.టి.రామారావుపై 1995లో తిరుగుబాటు చేయడమే.

2019 ఎన్నికల ముందు బిజెపితో తెగతెంపులు చేసుకోవడాన్ని కూడా  చంద్రబాబు ధైర్యానికి తార్కాణంగా ఎవరన్నా చూపిస్తారేమో! నిజానికి అప్పుడు ఆయనకు గత్యంతరం లేదు. అప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా విదిలించబోరని అర్ధమయిన తర్వాత కూడా చంద్రబాబు చాలాకాలం తాత్సారం చేశారు. ఎన్నికలు సమీపించే సరికి బిజెపి వ్యతిరేకతపై వోట్లు రాబట్టవచ్చన్న నమ్మకంతో తెగతెంపులు చేసుకున్నారు.

ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం టిడిపిని నానారకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న నేపధ్యంలో ఆయన తాను బిజెపికి వ్యతిరేకం కాదన్న రీతిలో మాటలు వదిలారు. రాష్ట్రం కోసమే తాను ఆనాడు ఎన్‌డిఎతో బంధం తెంచుకోవాల్సి వచ్చిందనీ, వ్యక్తిగతంగా తనకు వైరం లేదనీ అన్నారు.

దానికి తోడుగా అటు తెలంగాణ హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టిడిపి అభ్యర్ధిని పోటీలో దింపారు. నిజానికి అక్కడ బలమైన పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీ ఎమ్మెల్యే ఖాళీ చేసిన కారణంగానే ఉపఎన్నిక వచ్చింది.  పోటీకి దిగడం ద్వారా తాను కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నానన్న సందేశాన్ని చంద్రబాబు బిజెపికి పంపారని అనుకోవాల్సి వస్తున్నది. అలా కాకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను దెబ్బ తీసేందుకు టిడిపి అక్కడ పోటీ నుంచి తప్పుకోవాల్సింది. కెసిఆర్ చంద్రబాబు విషయంలో ఎంత తూష్ణీభావంతో ఉన్నారో తెలిసిందే. దానికి తోడు తనకు రాజకీయంగా శత్రువు అయిన వైఎస్ జగన్‌తో ఆయన సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారు. అలాంటి కెసిఆర్‌కు అనుకూలించే విధంగా   హుజూర్‌నగర్‌లో చంద్రబాబు అభ్యర్ధిని దింపడమేమిటి?

ఈ పరిణామం సంగతి పక్కన పెడితే చంద్రబాబు నోట వచ్చిన మాటను బిజెపి నాయకులు గట్టిగా పట్టుకున్నారు. దిక్కు తోచని స్థితిలో చంద్రబాబు బిజెపితో చెలిమికి సిద్ధమన్న సంకేతాలు ఇస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అంతటితో ఆగితే సరిపోను. టిడిపిని ఎవరూ నమ్మలేరనీ,  ఆ పార్టీతో మళ్లీ పొత్తు ఉండదనీ బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. బిజెపిలో టిడిపిని విలీనం చేస్తామంటే అప్పుడు ఆలోచిస్తామని ఆయన అన్నారు.

మరో బిజెపి జాతీయ నాయకుడు సునీల్ దేవ్‌ధర్ శనివారం మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడితో మళ్లీ చెలిమి చేయకూడదని తమ పార్టీ నాయకత్వం నిర్ణయించిందనీ, ఆయనకు ఇక తమ పార్టీ తలుపులు తెరచుకోవనీ వ్యాఖ్యానించారు. క్రితం ఎన్నికలలో 175 సీట్లకు పోటీ చేసిన బిజెపికి 0.84 శాతం వోట్లు వచ్చాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మొదలు బిజెపి అభ్యర్ధులు అందరూ ధరావత్తు కోల్పోయారు. ఆ పరాభవం జరిగి గట్టిగా  ఆరు నెలలు తిరగకుండానే బిజెపి ఈ  మాటలంటున్నది. 1983లో ఆవిర్భావం నాటినుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను 16 ఏళ్ల పాటు, విభజిత ఆంధ్రప్రదేశ్‌ను అయిదేళ్ల పాటు పాలించిన పార్టీని విలీనం చేసుకుంటానంటున్నది. అందుకు చంద్రబాబు స్వయంగా అవకాశం ఇచ్చారు.

దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేసేందుకు చూస్తున్న బిజెపి ఆంద్రప్రదేశ్‌లో బలపడేందుకు కూడా వ్యూహాలు పన్నుతున్నది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపిని బలహీనపరచకపోతే కష్టమన్న నిర్ణయానికి వచ్చి ఆ దిశగా ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వంపై వివిధ అంశాల మీద పోరాటం చేయడం ఒకటి. పాలనలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని నిరూపించేందుకు కేంద్రప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకుండా చేయడం రెండు. ముఖ్యమంత్రి జగన్‌పై ఆర్ధిక అక్రమాల కేసుల  విచారణ కొనసాగినంత కాలం ఆయన గట్టిగా తమను ఎదుర్కోలేరన్నది బిజెపి ధైర్యం.

వైసిపిని ఆ పద్ధతిలో బలహీనం చేసిన తర్వాత బిజెపి ఆక్రమించాల్సిన చోటు ఎవరిది? ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టిడిపి స్థానాన్నే బిజెపి ఆక్రమించ చూస్తుందన్న సంగతి ఎవరికైనా అర్ధం అవుతుంది. మరి టిడిపికి స్నేహహస్తం చాచిన పక్షంలో బిజెపి ఆ చోటును ఎలా ఆక్రమించగలదు? గతంలో టిడిపితో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఉనికి సాధించాలని బిజెపి ప్రయత్నించిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా బిజెపి అదే పని చేస్తుందని టిడిపి అధినేత భావిస్తున్నట్లయితే అది రాజకీయంగా సరైన ఆలోచన అవుతుందా?

175 సీట్ల శాసనసభలో 23 స్థానాలకు పరిమితమైన టిడిపి ఒకపక్క. 2014 ఎన్నికల ఫలితాలను మించి స్వయంగా 303 లోక్‌సభ సీట్లు గెలిచిన బిజెపి ఒకపక్క. అయిదేళ్ల పాలన తర్వాత పార్టీకి ఘోర పరాజయాన్ని కట్టబెట్టి నైతికంగా కుంగుబాటులో ఉన్న చంద్రబాబు నాయుడు ఒకపక్క. అదే అయిదేళ్ల పాలన తర్వాత పార్టీకి అసాధారణ విజయం సాధించి పెట్టిన నరేంద్ర మోదీ ఒకపక్క. తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో జట్టుకట్టి జాతీయ ప్రత్యామ్నాయం రూపొందించేందుకు కృషి చేసిన  చంద్రబాబు ఒకపక్క. ఆ కొత్త చెలిమిని విజయవంతంగా ఎదుర్కొన్న మోదీ మరోపక్క.

ఇప్పుడు చెప్పండి, అలాంటి చంద్రబాబు నాయకత్వంలోని టిడిపిని దెబ్బ తీసేందుకు చూస్తారా మోదీ – అమిత్ షా లేక మళ్లీ టిడిపిని మిత్రపక్షంగా స్వీకరించి తాము మరోసారి ఆ ప్రాంతీయ పార్టీతో పొత్తు లేకపోతే ఉనికిని నిలబెట్టుకోలేని పరిస్థితిని తెచ్చుకుంటారా? ఇక్కడ బిజెపి ప్రయత్నించినంత మాత్రాన టిడిపి దెబ్బ తినిపోతుందా లేదా అన్నది కాదు అసలు విషయం. అంతిమంగా ఏ పార్టీకయినా కావాల్సింది ప్రజల మద్దతు. అది ఉన్నంతకాలం దానిని ఎవరూ ఏమీ చేయలేరు. వైసిపిని ఎదుర్కోవడం కోసం బిజెపి పట్ల స్నేహభావాన్ని చంద్రబాబు మళ్లీ ప్రకటించడం ఆయన పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సరైనదా కాదా అన్నదే మీమాంస. అలా మెతక వైఖరి ప్రకటించడం వల్ల చంద్రబాబు తనను తానే బలహీనం చేసుకోవడం లేదా అన్నది ప్రశ్న.

-ఆలపాటి సురేశ్ కుమార్

author avatar
Siva Prasad

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment