జగన్ భారీ విజయంతో పెరిగిన అంచనాలు
న్యూఢిల్లీ: అనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు అన్నట్లుగా.. అనేక ఎన్నికల్లో చాలామంది నాయకులకు పదవీభాగ్యం కల్పించిన వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్ (పీకే). ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించడంలో పీకేకు డిమాండు బాగా పెరిగింది. తెలుగుదేశం పార్టీని దాదాపు నామరూపాల్లేకుండా చేసి ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలతో పాటు 22 లోక్ సభ స్థానాలను కూడా గెలుచుకున్న వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్.. మరో వారం రోజుల్లో కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గురువారం ఓట్ల లెక్కింపు జరుగుతున్నంత సేపూ జగన్ హైదరాబాద్ లోని తన ఇంట్లో ప్రశాంత్ కిశోర్ తో పాటే కూర్చుని ఫలితాలను టీవీలలో చూస్తూ ఉన్నారు. వైసీపీ తొలిసారి రాష్ట్రంలో అధికారం చేపట్టబోతోంది. పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా నిలిచింది.
Thank you Andhra and colleagues at @IndianPAC for the landslide victory.
Congratulations and best wishes to the new CM @ysjagan— Prashant Kishor (@PrashantKishor) May 23, 2019
‘‘భారీ విజయాన్ని అందించినందుకు థాంక్యూ ఆంధ్రా, ఐప్యాక్ సహచరులారా. కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు’’ అని ప్రశాంత్ కిశోర్ తన సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. బిహార్ లోని జేడీయూ ఉపాధ్యక్షుడు కూడా అయిన పీకేకు ఇంతవరకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ఎన్నికలలో పెద్దగా పనులేమీ చెప్పలేదు. యువతలో పార్టీని విస్తరించడంలో నితీష్ పెద్దగా ప్రయత్నాలు చేయలేదని బీజేపీ నుంచి నితీష్ పై ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ విషయం గుర్తించిన వెంటనే పీకేను పక్కన పెట్టాలని నితీష్ నిర్ణయించినట్లు తెలిసింది. కానీ ఇప్పుడు జగన్ భారీ విజయంతో పీకే డిమాండు ఒక్కసారిగా పీక్స్ కు చేరుకుంది. మరిన్ని పార్టీలు ఇప్పుడు ఆయనను ఆశ్రయిస్తున్నాయి. ఎన్నికలు రావడానికి రెండేళ్ల ముందు నుంచి ప్రశాంత్ కిశోర్ సంస్థ జగన్ మోహన్ రెడ్డి పార్టీతో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరిగింది.
@ysjagan @PrashantKishor and @rishipedia watching @YSRCParty 's landslide victory together!#ElectionResults2019 #Verdict2019 #LokSabhaElections #APElections2019 pic.twitter.com/MluFSv5X7E
— I-PAC (@IndianPAC) May 23, 2019
తాను ఏర్చి కూర్చిన కూటమిలో ఆర్జేడీని పక్కన పెట్టేయడం, ముఖ్యంగా తేజస్వి యాదవ్ కు గట్టి ఎదురుదెబ్బ తగలడంతో కాంగ్రెస్, ఆర్జేడీలను నితీష్ తో కలపాలన్న పీకే ప్రయత్నాలకు గండిపడింది. 2014లో నరేంద్రమోదీ ప్రధాని కావడానికి, 2015లో నితీష్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి కావడానికి కూడా పీకేనే కారణం. కానీ 2017లో ఉత్తరప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్-ఎస్పీ కూటమి విషయంలో ఆయన విఫలమయ్యారు. వ్యక్తిగతంగా తీవ్ర శోకంలో ఉన్నా.. ఎన్నికల విషయంలో మాత్రం చాలా పక్కాగా ఉన్నారని, సుమారు వారం క్రితమే ప్రశాంత్ కిశోర్ తండ్రి మరణించారని ఆయన సన్నిహితులు తెలిపారు. అయినా చివరి నిమిషం వరకు జగన్ కు అండగా ఉండి భారీ విజయాన్ని ఆయనకు అందించారు.