చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించి వణికిస్తోంది. దాదాపు అన్ని దేశాలలో ప్రభుత్వాలు కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజు రోజుకు కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఏమిటా నిర్ణయం అనుకుంటున్నారా? మాస్క్ లు లేకుండా ఎవరైనా ప్రజలు రోడ్డు మీదకు వస్తే మాడు పగిలిపోయేలా జరిమానా వసూలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. రూ.500లో రూ.1000 రూపాయలో కాదు ఏకంగా పది వేయి రూపాయలు (100 పౌండ్ లు) జరిమానా వసూలు చేయనున్నారు. ఈ నెల 24 వ తేదీ నుండి మాస్క్ లు లేకుండా తిరిగే వారి నుండి ఈ మేర జరిమానా వసూలు చేస్తారట. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కరోనా కట్టడికి ప్రధానంగా మాస్క్ లు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని పాలకులు విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. దీనితో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ లో 2లక్షల 91వేల కరోనా కేసులు నమోదు కాగా 44 వేల మంది మృతి చెందారు. ఇంత పెద్ద మొత్తంలో జరిమానా కట్టవలసి వస్తుందన్న భయంతో బహిరంగ ప్రదేశాలకు వచ్చే వారు మాస్క్ లు ధరిస్తారేమో.
ఇండియాలో ఈ తరహా నిర్ణయం తీసుకుంటే…
ఇండియాలో కూడా ఒకప్పుడు బ్రిటన్, ఇంగ్లాండ్లలో ఎలా పెరిగాయో అదే మాదిరిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు దాదాపు రోజుకు 30 వేల వరకు పాజిటివ్ లు వస్తున్నాయి. నేటి వరకు ఇండియాలో 9 లక్షల 36వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 24,309మంది మరణించారు. 5 లక్షల 92వేల మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలోనూ కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో ఇంగ్లాండ్ లో మాదిరిగా సంచలన నిర్ణయాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఏపిలోనూ లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇప్పుడు మళ్ళీ లాక్ డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కేసుల పెరుగుదల ఉన్న జిల్లాలు, ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. గత వారం ప్రకాశం జిల్లలో 15 రోజులు లాక్ డౌన్ పెట్టారు. అది కొనసాగిస్తున్నారు. మొన్నటి నుండి తూర్పుగోదావరి జిల్లాలో, నిన్నటి నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో లాక్ డౌన్ పెట్టారు. ఇలా జిల్లాల వారీగా లాక్ డౌన్ లు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో నేటి వరకు 33వేల కేసులు నమోదు కాగా 408మంది మరణించారు. 17,467మంది చికిత్స అనంతరం కోలుకున్నారు.