న్యూఢిల్లీ: భూమ్మీద నూకలు రాసిపెట్టి ఉంటే చావు రాదంటారు. ఢిల్లీలో ఓ మహిళ విషయంలో ఇది మరోసారి రుజువైంది. మెట్రో రైలు ఎక్కడానికి వెళ్లిన ఆమె.. రూ. 2వేల నోటు కింద పారేసుకుంది. అది కాస్తా పట్టాల మీద పడింది. దాన్ని తీసుకోడానికి ఆమె ఒక్కసారిగా పట్టాల మీదకు దూకింది. నోటు తీసుకుని పైకి వచ్చేలోపే రైలు వచ్చేసింది. ఆమె రైలు కిందకు వెళ్లిపోయింది. అయినా బతికి బయటపడింది. ఈ ఘటన ఢిల్లీలోని ద్వారకా మోర్ మెట్రోస్టేషనులో చోటుచేసుకుంది.
చేతనా శర్మ అనే సదరు మహిళ ఢిల్లీలో మెట్రోరైలు ఎక్కేందుకు స్టేషనకు వచ్చారు. అంతలో డబ్బులు కింద పారేసుకున్నారు. వాటిని తీసుకుంటుండగా రైలు వచ్చింది. ఒక్కసారిగా అక్కడున్న ప్రయాణికులు గట్టిగా అరిచారు. దాంతో అప్రమత్తమైన డ్రైవర్ రైలును ఆపాడు. కానీ అప్పటికే ఆమె రైలు కిందకు వెళ్లిపోయింది. కానీ అదృష్టవశాత్తు రెండు పట్టాలకు మధ్య ఉండే ప్రాంతంలో ఆమె పడుకున్నారు. దాంతో ప్రాణాలు దక్కించుకోగలిగారు. తర్వాత మెట్రో భద్రతను చూసే సీఐఎస్ఎఫ్ సిబ్బంది కొద్దిసేపు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి లిఖితపూర్వక క్షమాపణ తీసుకుని తర్వాత వదిలేశారు.