న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్కు వెళ్లినప్పుడు ట్రయల్ రూమ్లో ఏమరపాటుగా ఉంటే ఊహించని డ్యామేజ్ జరగడం ఖాయం. తాజాగా ఓ మాల్లో దుస్తులు కొనుగోలు చేసిన ఓ మహిళ జర్నలిస్టు.. ట్రయల్ రూమ్లో వాటిని మార్చుకుంటుండగా.. ఎవరో కెమెరాతో చిత్రీకరించడం గుర్తించింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ఎం బ్లాక్ చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్టు 31వతేదీన తాను దుస్తులు కొనేందుకు దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ఎం బ్లాక్ మార్కెట్కు వచ్చి ట్రయల్ రూంలో దుస్తులు ట్రయల్ చేసుకుంటుండగా.. దుకాణదారుతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు రహస్య కెమెరాలతో చూశారని ఢిల్లీకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ సంఘటనపై ఫిర్యాదు చేసిన 3 రోజుల తర్వాత గ్రేటర్ కైలాష్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 354 సి కింద కేసు నమోదు చేసినా దుకాణదారుడిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
బట్టల షోరూంలో స్పై కెమెరా పెట్టిన ఘటనలు గతంలోనూ వెలుగు చూశాయి. 2015లో గోవాలోని ఫ్యాబ్ స్టోరులోని ట్రయల్ రూంలో రహస్య కెమెరాతో చిత్రీకరిస్తున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి దేశరాజధానిలోనే ఇలాంటి ఘటన జరగడం గమనార్హం. ‘నేను సెలక్ట్ చేసుకున్న దుస్తులను ట్రయల్ చేసేందుకు ముందు ఓ ట్రయల్ రూంకు వెళ్లి చూసుకున్నాను. పదినిమిషాల తర్వాత ఓ మహిళ వచ్చి మరో ట్రయల్ రూంలోకి వెళ్లి బట్టలు మార్చుకొని చూసుకోవాలని సూచించింది. ఆ మహిళ చెప్పిన ట్రయల్ రూంలోకి వెళితే అక్కడ గదిలో సీక్రెట్ కెమెరా కనిపించింది. నేను ట్రయల్ రూంలో దుస్తులు మార్చుకుంటుండగా దుకాణదారుడితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు గది దగ్గర కూర్చొని కంప్యూటరులో మహిళలు బట్టలు మార్చుకునే వీడియోలు చూస్తున్నారు’ అని 27 ఏళ్ల మహిళా జర్నలిస్టు పేర్కొంది. దీనిపై తాను పోలీసు కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేయగా, దుకాణదారుడు సీసీటీవీ ఫుటేజీని తొలగించాడని మహిళ జర్నలిస్టు ఆరోపించారు.