(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
చైనాలో మొదట బయటపడి ఇప్పటికి 15 దేశాలకు పాకిన కరోనా వైరస్ బెడదను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ప్రపంచ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అసాధారణమైన ఏ ఆరోగ్య సమస్య పట్ల అయినా ప్రపంచ దేశాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నపుడు ఈ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తారు.
ఒక వారం క్రితం కరోనా వైరస్ను హెల్త్ ఎమర్జెన్సీ కింద ప్రకటించేందుకు డబ్ల్యుహెచ్ఓ నిరాకరించింది. అందుకు తగిన సాక్ష్యాధారాలు లేవని ప్రకటించింది. ఈ వారం రోజుల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. అమెరికాలో ఇప్పటికి ఆరుగురికి కరోనా వైరస్ సోకింది. మనిషి నుంచి మనిషికి వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం కూడా నిరూపణ అయింది.
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడానికి కారణం చైనాలో పరిణామాలు కాదనీ, గట్టి వైద్య ఆరోగ్య వ్యవస్థలు లేని దేశాలకు ఈ వైరస్ పాకితే సంభవించగల విపరిణామాల దృష్ట్యా ఈ ప్రకటన చేశామనీ డబ్ల్యుహెచ్ఓ డైరక్టర్ జనరల్ మీడియా సమావేశంలో చెప్పారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా శ్లాఘనీయమైన కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు.
చైనాలో ఇప్పటివరకూ 7711 మందికి కరోనా వైరస్ సోకగా దాని వల్ల 170 మంది మరణించారు. గత 24 గంటలలోనే 38 మంది మృతి చెందినట్లు ప్రకటించారు. ఇండియాలో కరోనా వైరస్ సోకిన మొదటి కేసు కేరళలో బయటపడింది.