బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కశ్మీర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లో పరిస్థితిని పరిశీలిస్తున్నామని, పాక్ కు చెందిన ప్రధాన అంశాల వరకు ఆ దేశానికి మద్దతిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు చైనా అధికార న్యూస్ ఏజెన్సీ జిన్హువా పేర్కొంది. బీజింగ్ లో జరిగిన ఓ సమావేశంలో ఏది తప్పు, ఏది ఒప్పు అనేది స్పష్టంగా తెలుస్తోందని పాక్ ప్రధానితో జిన్పింగ్ అన్నట్లు తెలిపింది. అదే సమయంలో కశ్మీర్ అంశాన్ని ఇరు దేశాలు శాంతియుతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని జిన్పింగ్ సూచించినట్లు పేర్కొంది.
జమ్ముకశ్మీర్ క స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే, జిన్పింగ్ భారత్ పర్యటనకు ముందు చైనా పాక్ ప్రధాని ఇమ్రాన్ ను చర్చలకు ఆహ్వానించింది. పాక్ స్వాతంత్ర్య సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడతామని భేటీ అనంతరం చైనా ప్రధాని లీ కెకియాంగ్ తెలిపారు.
మరోవైపు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో ఆయన ప్రధాని మోదీతో కలిసి తమిళనాడులో పర్యటించనున్నారు. చెన్నై వేదికగా ఇరు దేశాధినేతలు పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఉగ్రవాదంపై, పరిశ్రమల స్ధాపన, పెట్టుబడులు, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో సహకారంపై ప్రధానంగా చర్చలు జరిగే అవకాశాలున్నాయి. అయితే, ఎన్నడూ లేని విధంగా దక్షిణాది రాష్ట్రంలో చర్చలు జరపడం ఆసక్తిగా మారింది.