అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంతో గన్నవరం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు మెత్తపడినట్లేనా? నియోజకవర్గ వైసిపి బాధ్యతలు ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అప్పగించేందుకు లైన్ క్లీయర్ అయినట్లేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. యార్లగడ్డను సమాధానపరిచేందుకే కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కెడిసిసి) చైర్మన్ పదవి కట్టబెట్టారనే ప్రచారం జరుగుతోంది.
టిడిపికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపి కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా అధికారికంగా వైసిపిలో చేరకపోయినా టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్పై తీవ్ర స్థాయిలో విమర్శలూ చేశారు. జగన్ వెంట నడుస్తానని కూడా వంశీ ప్రకటించారు. వైసిపిలో వంశీ చేరికను ఆ నియోజకవర్గ ఇన్చార్జి యార్లగడ్డ మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు పలు దఫాలు చర్చలు కూడా జరిపి జగన్మోహనరెడ్డి వద్దకు కూడా తీసుకువెళ్లారు. అయితే జగన్ వద్ద సంబాషణలో వంశీ చేరిక విషయం ప్రస్థావనకు రాలేదని యార్లగడ్డ ఇటీవల మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇదే సమావేశంలో వంశీ పేరు ప్రస్థావించకుండానే పరోక్షంగా యార్లగడ్డ తీవ్ర విమర్శలు చేశారు. తానే నియోజకవర్గ ఇన్చార్జినని కూడా తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వంశీపై స్వల్ప ఓట్ల తేడాతోనే యార్లగడ్డ పరాజయం పాలయ్యారు. ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత కూడా వంశీ, యార్లగడ్డ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితే ఉంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేసుకుంటూ వచ్చారు. వంశీ ఎన్నికను సవాల్ చేస్తూ యార్లగడ్డ హైకోర్టులో పిటిషన్ కూడా వేసి ఉన్నారు. తహశీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఇళ్లపట్టాలను ప్రజలకు ఇచ్చి మోసానికి పాల్పడ్డారంటూ కూడా వంశీపై కేసు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో యార్లగడ్డ కెడిసిసి చైర్మన్ పదవితో సంతృప్తి చెందుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది