అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేసే యోచనలో వైసీపీ ప్రభుత్వం సమాలోచన చేస్తోందని ప్రచారం జరుగుతున్న వేళ.. టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలి రద్దు అంత సులభం కాదని ఆయన అన్నారు. పార్లమెంట్ నిర్ణయంతోనే మండలి రద్దు సాధ్యమవుతుందన్నారు. మండలి రద్దుకు కనీసం ఏడాది సమయం పడుతుందని యనమల చెప్పారు.
మరోవైపు మండలి రద్దు యోచన అప్రజాస్వామికమని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. రూల్ 71పై ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. మండలిని రద్దు చేస్తామంటే భయపడేది లేదని చెప్పారు. మండలి రద్దు చేసే అధికారం వైసీపీకి ఎక్కడిదని ప్రశ్నించారు. మండలి రద్దుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ కేవలం తీర్మానం మాత్రమే చేయగలదని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా మండలిలో తాము కూడా తీర్మానం చేయగలమని తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించాలని తాము కోరుతుంటే… ప్రభుత్వం మాత్రం మండలి రద్దు అంటోందని మండిపడ్డారు.
శాసనమండలిని రద్దు చేసే యోచనలో వైసీపీ ప్రభుత్వం సమాలోచన చేస్తోంది. దీనిపై సుదీర్ఘంగా వైసీపీ పెద్దలతో చర్చలు జరుపుతోంది. అవసరమైతే అత్యవసరంగా కేబినెట్ భేటీ నిర్వహించే యోచనలో ఉంది. ఏపీ శాసనసభలో 151 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండటంతో వైసీపీ ప్రభుత్వం పెడుతున్న బిల్లులన్నీ ఆమోదం పొందుతున్నాయి. మరోవైపు, శాసనమండలిలో విపక్ష తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజర్టీ ఉంది. వీరితో పాటు ఇద్దరు బీజేపీ సభ్యులు కూడా ఉన్నారు. దీంతో మండలిలో బిల్లులు పాస్ కావడం లేదు. ఈ నేపథ్యంలోనే శాసనమండలిని ప్రభుత్వం రద్దు చేయబోతోందనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి.