అమరావతి: వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత నియామకం జరగబోతున్న తొలి నామినేటెడ్ పోస్టే వివాదాస్పదం అయ్యే పరిస్థితి నెలకొంది. టిటిడి బోర్డు చైర్మన్గా మాజీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డిని నియమించనున్నట్లు వార్తలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని వైవి సుబ్బారెడ్డిని కాదని టిడిపి నుండి వైసిపిలో చేరిన మాగుంట శ్రీనివాసరెడ్డికి కేటాయించిన విషయం తెలిసిందే.
సిఎం జగన్మోహనరెడ్డి బుధవారం రాత్రి వైవి సుబ్బారెడ్డితో భేటీ అయి టిటిడి చైర్మన్ పదవి తీసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. అయితే వైవి రాజ్యసభ నామినేషన్కు మొగ్గుచూపినట్లు సమాచారం. అస్తవ్యస్థంగా ఉన్న టిటిడిని ఒక గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందనీ సిఎం జగన్ ఆయనకు నచ్చజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వం మారిన సందర్భంగా నైతిక బాధ్యత వహించి టిటిడి చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యావద్ రాజీనామా చేస్తారని భావించారు. అయితే రాజీనామాకు ఆయన ససేమిరా అనడంతో త్వరలో ఆర్డినెన్స్ ద్వారా టిటిడితో సహా ఇతర ఆలయాల పాలకవర్గాలను రద్దు చేయాలని నూతన ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ పాలకవర్గాన్ని రద్దు చేసిన వెంటనే టిటిడి చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి పేరును అధికారికంగా ప్రకటించనున్నారని వైసిపి వర్గాల ద్వారా తెలుస్తోంది.
కాగా క్రైస్తవుడైన వైవి సుబ్బారెడ్డికి టిటిడి చైర్మన్ పదవి అప్పగించడం ఏమిటంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విమర్శిస్తున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిటిడి చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ను నియమించిన సమయంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. పుట్టాకు క్రైస్తవ సంఘాలతో సంబంధాలు ఉన్నాయంటూ నాడు ఆర్ఎస్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. క్రైసవ మహసభలకు ఆహ్వానితుడుగా పుట్టా వెళ్లిన సందర్భంలో ఏర్పాటు చేసిన బ్యానర్లను నాడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో స్వయంగా పుట్టా తాను హిందువునని ప్రకటించుకున్నారు. వివిధ సంఘాలతో పాటు క్రైస్తవ సంఘాలకు విరాళాలు ఇస్తుంటానని ఆ అభిమానంతోనే వారు ప్లెక్సీలపై తన ఫోటో వేసుకున్నారు తప్ప తాను క్రైస్తవ మతం స్వీకరించలేదని చెప్పుకున్నారు.
ఇదే బోర్డులో టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనితను డైరెక్టర్గా నియమించిన సమయంలోనూ వివాదమయ్యింది. తన బ్యాగ్లో ఎప్పుడూ బైబిల్ ఉంటుందని ఒక యూట్యూబ్ ఛానల్కు అనిత ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తాను హిందువునేననీ, క్రైస్తవ మతం స్వీకరించలేదని ప్రకటించుకొన్నది. ఆ పదవి తనకు రాకుండా చేయడం కోసం ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వీడియోను ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారని ఆరోపించింది. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో స్వచ్చందంగా డైరెక్టర్ పదవిని అనిత వదులుకున్నారు.
టిటిడి చైర్మన్గా వైవి సుబ్బారెడ్డిని నూతన ప్రభుత్వం నియమించనుందని వార్తలు వెలవడగా గురువారం వికీపిడియాలోని వైవి సుబ్బారెడ్డి బయోడేటాను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ బయోడేటాలో మతం అన్న కాలం వద్ద క్రిష్టియన్ అని ఉండగా కొద్ది సేపటికి తరువాత దాన్ని ఎడిట్ చేశారు.
ఈ వివాదాల నడుమ సిఎం జగన్మోహనరెడ్డి దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.