(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రాజధాని అంశంపై ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ చేసిన ప్రకటనపై వైసీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. సీఎం ప్రకటనపై అధికార పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ దారిలోనే వైసీపీ నేతలలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. అమరావతి పెద్ద స్కాం అని, మూడు రాజధానులపై సీఎం జగన్ చేసిన ప్రకటన మంచి కాన్సెప్ట్ అని మంత్రులు, అంబటి సహా పలువురు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. అయితే, గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డితోపాటు మరికొంత మంది సీఎం వ్యాఖ్యలతో విభేదిస్తున్నారు.
అధికార, పాలన వికేంద్రీకరణ కంటే.. అభివృద్ధి వికేంద్రీకరణ ఉత్తమమైన మార్గమని పీలేరుకు చెందిన వైసీపీ నేత, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారపాకుల భాస్కరనాయుడు అన్నారు. మూడు రాజధానులు ఏర్పాటుచేస్తే చిత్తూరు జిల్లావాసులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ‘జిల్లా నుంచి విశాఖ వెళ్లాలంటే వెయ్యి కిలోమీటర్లు.. అమరావతిలోని అసెంబ్లీకి, కర్నూలులో హైకోర్టుకు వెళ్లాలంటే 400కిలోమీటర్ల చొప్పున ప్రయాణించాలి. వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుపతిని సాంస్కృతిక, ఆధ్యాత్మిక రాజధానిగా మార్చాలి. దీంతోపాటు హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలి. పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి. ఇలాచేస్తేనే సీఎం జగన్ జిల్లాకు న్యాయం చేసినవారవుతారు’ అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబును నమ్మి రాజధాని రైతులు ఇప్పటికే పెద్దఎత్తున నష్టపోయారని, జగన్ వారికి న్యాయం చేసి, చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కిచెప్పారు. కేంద్రంతో తగవులు పెట్టుకున్న చంద్రబాబు విభజన హామీలను సాధించలేకపోయారని తెలిపారు. రాజధాని కోసం 33వేల ఎకరాల భూములను రైతుల నుంచి తీసుకుని కనీసం రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. రాజధాని రైతుల ఈ దుస్థితికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు. తన కోటరీలోని వ్యక్తులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్రాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు. చంద్రబాబులా కాకుండా జగన్ ప్రజలకు మేలు చేయాలని, రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు.
మరోవైపు పరిపాలన అంతా ఒకచోట నుంచే జరిగితే బాగుంటుందని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతోపాటు పరిపాలన వికేంద్రీకరణ కూడా జరగాల్సిన అవసరం ఉందని, విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని ఏర్పాటు చేయాలన్నారు. రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, అది కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాతేనని చెప్పారు.
ఇదిఇలా ఉంటే.. మూడు రాజధానులపై సీఎం జగన్ వ్యాఖ్యల అనంతరం టీడీపీలోనే భిన్నస్వరాలు వినిపించగా… ఇప్పుడు వైసీపీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మూడు రాజధానుల ప్రకటనతో వైసీపీ నేతలు అందరూ మద్దతు ఇస్తారనుకుంటే.. సొంతపార్టీ నేతలే మరో రకమైన వాదనను వినిపిస్తుండటంతో ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అభివృద్ధి ఒకే ప్రాంతంలో ఉంటే ప్రాంతీయ అసమతూల్యత చోటు చేసుకుంటుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొంటే…దానికి భిన్నంగా అధికార పార్టీ నేతలే వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్లయింది. మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.