అమరావతి: జగన్ వంద రోజుల పాలనను విమర్శిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివేదిక విడుదల చేయడంపై వైసిపి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.మంత్రి అవంతి శ్రీనివాస్, ఏపిఐఐసి చైర్ పర్సన్ ఆర్ కె రోజా, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా తదితరులు వేరువేరుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశాలలో పవన్ చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు.
చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే పవన్కు జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని వారు అన్నారు. 650 హామీలు ఇచ్చి అమలు చేయని చంద్రబాబును నాడు పవన్ ఎందుకు విమర్శించలేదని ప్రశ్నించారు. మూడు నెలల జగన్ పాలనలో పవన్ కు అభివృద్ధి ఎమి కనపడలేదా అని ప్రశ్నించారు. అధికారం లోకి వచ్చిన వంద రోజుల్లోనే 80 శాతం హామీలను అమలు చేశామని రోజా చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో వైఎస్ జగన్ ను ప్రజలు గెలిపించారనీ, అది తిరగ బడినా 151 అవుతుందనీ రోజా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే స్థానం గెలిచిన పవన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని రోజా హితవు పలికారు.
తాము అధికారం లోకి వచ్చిన మూడు నెలలలోనే 19 చరిత్రాత్మక బిల్లులు తీసుకువచ్ఛామని కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజా అన్నారు. చంద్రబాబు పాలనలో విమర్శలు చేయని పవన్.. మూడు నెలలలోనే జగన్ పాలనపై ప్రశ్నిస్తున్నారనీ దీన్ని బట్టి చుస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయో అర్ధం అవుతుందని రాజా అన్నారు. టిడిపి హయంలో పచ్చ చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరూ ఇసుక మాఫియా చేసారని రాజా ఆరోపిస్తూ అప్పుడు పవన్ కు కనపడలేదా అని ప్రశ్నించారు.