(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాడే పరిస్థితి లేదనీ, అడుగుతూనే ఉంటామనీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పినట్లుగా వైసిపి పార్లమెంట్ సభ్యులు గురువారం మరో సారి ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అభ్యర్థించారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని బిజెపి నేతలు తరచు చెబుతున్నా వైసిపి నేతలు మాత్రం కేంద్రానికి వినతి పత్రాలను ఇస్తూనే ఉన్నారు.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో గురువారం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన ఎంపిలతో పాటు వైసిపికి చెందిన వి.విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు పాల్గొన్నారు. ఏపి అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని వైసిపి ఎంపిలు కోరారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రధానమైన తొమ్మిది అంశాలను లేవనెత్తారు. ఏపికి ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించాలని కోరారు.
రెవెన్యూ లోటు బకాయిలు 18,969 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలనీ, వెనుకబడిన జిల్లాలకు 23వేల కోట్ల రూపాయలు మంజూరు చేయాలనీ, పోలవరం ప్రాజెక్టుకు ప్రభుత్వం ఖర్చు చేసిన 3,283 కోట్ల రూపాయలను రీయింబర్స్ చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల వ్యయం 55,548 కోట్ల రూపాయలను అమోదించాలనీ, రాజధాని నగరం అభివృద్ధి కోసం గ్రాంట్గా 47,424 కోట్ల రూపాయలు ఇవ్వాలనీ విజ్ఞప్తి చేశారు. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్కు ఆర్థిక సహాయం చేయాలని కోరారు.