(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి : రాష్ట్రంలోని వైసీపీ పై కేంద్రంలోని బిజెపి వైఖరి మార్చుకున్నదా? ప్రస్తుతం జగురుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రితో భేటీ అయిన 48 గంటల్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు అయింది. నేటి సాయంత్రం ఆరు గంటలకు షాతో జగన్ భేటీ కానున్నారు. గతంలో రెండు పర్యాయాలు జగన్ హస్తినకు వెళ్లినా షా అపాయింట్మెంట్ లభించలేదని అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం మండలి రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ తదితర ప్రధాన సమస్యల నుండి గట్టెక్కాలంటే కేంద్రంలోని బిజెపితో వైసీపీ మైత్రిత్వం నడపాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బిజెపి.. ఏపిలో బలంగా ఉన్న వైసీపీపై వైఖరి మార్చుకున్నదనీ, అందుకే కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు అవకాశం కల్పించనున్నారనీ వార్తలు వస్తున్నాయి. నేడు అమిత్ షాతో జగన్ భేటీ అనంతరం ఈ విషయాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇప్పటి వరకూ వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తూ విమర్శలు చేసిన రాష్ట్ర బిజెపి నాయకత్వం, ఇటీవలే ఆ పార్టీతో జతకట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి?, బిజెపి, వైసీపీ మైత్రి బంధంపై పవన్ ఎ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. మోదీతో జగన్ భేటీ అయి వచ్చిన వెంటనే కేంద్రంలో మంత్రి పదవులకు జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టారని టిడిపి విమర్శలు అందుకున్నది. రాజధాని అమరావతి నుండి తరలించడానికి వీలులేదంటూ 55 రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్న అమరావతి ప్రాంత రైతులు ఇప్పటి వరకు కేంద్రంపై గంపెడు ఆశతో ఉన్నారు. వేగంగా మారుతున్న ఈ రాజకీయ పరిణామాలు వారిలో ఆందోళన కల్గిస్తున్నాయి.