అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు యుటర్న్ల్లో దిట్ట అని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని విమర్శించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టిడిపి అధినేత చంద్రబాబు, బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరిలను తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు సిద్ధంతమే యూటర్న్ అని వ్యాఖ్యానించారు. మొన్నటి వరకు ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు నేడు ఇంగ్లీష్ను తానే తీసుకొని వచ్చానని చెపుతున్నారని నాని అన్నారు. ఇంగ్లీష్ మీడియంపై రాద్దతం చేసి చంద్రబాబు నవ్వులపాలయ్యారని చెప్పారు. చంద్రబాబు మాదిరిగానే లోకేష్ కూడా యూటర్న్కు అలవాటు పడ్డారని అన్నారు.
ఎన్టిఆర్ పార్టీన సమయంలో టిడిపిని బంగాళాఖాతంలో కలుపుతానని చెప్పి తరువాత యూటర్న్ తీసుకొని ఆ పార్టీలోనే చంద్రబాబు చేరారని నాని గుర్తు చేశారు.బిజెపితో పొత్తు పెట్టుకొనని చెప్పి యూటర్న్ తీసుకొని మళ్ళీ పొత్తు పెట్టున్నారని అన్నారు. ఇలా అనేక సందర్భాలలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని నాని వివరించారు.ఎన్నికలకు ముందు సోనియా, మమతా, స్టాలిన్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన చంద్రబాబు ఇప్పుడు వారినే మర్చిపోయారని అన్నారు. ఎన్నికలకు ముందు మోది, అమిత్షాను తిట్టిన చంద్రబాబు ఎన్నికల తరువాత యూటర్న్ తీసుకొని మళ్ళీ వాళ్ళను పొగుడుతున్నారని అన్నారు.
టిడిపి నేతలు ప్రభుత్వ కార్యాలయాలు, అన్న క్యాంటీన్లకు పసుపు రంగులు వేసినప్పుడు పవన్ నాయుడు ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు.మిషనరీ స్కూల్స్లోనే తనకు దేశ భక్తి నేర్పారని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు, పవన్ నాయుడు, లోకేష్ది యూటర్న్ జీవితమేనని నాని విమర్శించారు.
సుజనా చౌదరి చంద్రబాబు కోవర్టేననీ, సుజన పార్టీ మారిన తరువాత ఆయన కాల్ డేటా చూస్తే చంద్రబాబుతో ఎన్ని సార్లు మాట్లాడారో తెలుస్తుందనీ అన్నారు.సుజనా చౌదరి వంటి ఇంటి దొంగలను బిజెపి ఎప్పుడు పట్టుకుంటుందో చూడాలన్నారు. సుజనా చౌదరి లాంటి వారు పార్టీలో చేరడం వలన బిజెపి సిద్ధాంతాలు మంటగలిసి పోయాయని అన్నారు. బ్యాంక్లను రుణాలు ఎగగొట్టిన ఘనుడు సుజనా చౌదరి అని విమర్శించారు. హజ్ యాత్రికులకు చంద్రబాబు హయాంలో డబ్బులిస్తే సుజనా చౌదరి ఎందుకు ప్రశ్నించలేదని నాని అడిగారు.జగన్మోహన్ రెడ్డి ముస్లిం, క్రిస్టియన్లకే కాదు ఆలయ పూజరులకు డబ్బులు ఇస్తున్నారని నాని గుర్తు చేశారు. సిఎం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.