(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: బిజెపి, జనసేన పొత్తులపై వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఈ సందర్భంగా తీవ్రంగా విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారి పొత్తుల విషయంపై మాట్లాడాలని అనుకోలేదనీ, అయితే ఏడు నెలల వైసిపి పాలనపై వారు విమర్శలు చేసిన కారణంగా హడావుడిగా ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందనీ చెప్పారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా స్థిరత్వం లేని పవన్ కళ్యాణ్తో బిజెపి కలిసి ప్రయాణం చేయడం అంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని అంబటి వ్యాఖ్యానించారు.
2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకున్న జనసేన 2019 ఎన్నికల నాటికి వారితో తెగతెంపులు చేసుకుని బిఎస్పి, వామపక్షాలతో కలిసి పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చిత్రమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్కు సుందరయ్య విజ్ఞాన భవనంలో కూర్చుని పుస్తకం చదువుతుంటే తరిమిళ నాగరెడ్డి చాలా గొప్పవాడుగానూ, చెగువీరా మహా యోధుడుగానూ, కమ్యూనిస్టు సిద్ధాంతం ఈ మానవాళిని బాగుచేసేదిగానూ అనిపిస్తుందనీ, అదే విధంగా ఎన్టిఆర్ ట్రస్ట్ భవనంలో పుస్తకాలు చదువుతుంటే చంద్రబాబు అంత గొప్ప మేధావి, పరిపాలనాదక్షుడు, లోకేష్ బాబు అంత తెలివిగలవాడు ఎవరూలేరని ఆయనకు అనిపిస్తుందనీ, అంతే కాకుండా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లైబ్రరీలో కూర్చుని పుస్తకం చదువుతుంటే ప్రధాని మోది అంత గొప్ప వారు ఎవరూ లేరనీ, అమిత్షా అంతా అనుభవజ్ఞుడు ఎవరూ లేరని ఆయనకు అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఒకొక్క లైబ్రరీ కూర్చుని పుస్తకాలు చదువుతుంటే ఆయనకు ఒకొక్క రకంగా అనిపిస్తుంది పాపం అన్నారు. మరి రేపు ఏ లైబ్రరీ కూర్చుంటారో, ఏ పుస్తకం చదువుతారో, రేపు వారికి ఎలా అనిపిస్తుందో అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. ఇలాంటి రాజకీయ స్థిరత్వం లేని వ్యక్తిని బిజెపి నమ్ముకొని నాలుగున్నరేళ్లు కుక్కతోక పట్టుకుని గోదారి ఈదుతానంటే తమకేమిటి అభ్యంతరం అని అంబటి వ్యాఖ్యానించారు.
గత ఎన్నికల్లో బిజెపి, జనసేన ఎలాంటి ప్రభావం చూపలేదని అంబటి అన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా బేషరతుగా పొత్తు ఎలా పెట్టుకున్నారని ఆయన ప్రశ్నించారు. గతంలో పాచిపోయిన లడ్డూ ఇచ్చారని విమర్శించిన పవన్ ఏవిధంగా బిజెపితో కలిసిపోయారని అంబటి అడిగారు. ఏ పార్టీతోనైనా నాలుగున్నరేళ్లు కలిసి ఉన్నారా అని ప్రశ్నించారు.
వైసిపి ఎవరితో కలవకుండా ఒంటిచేత్తో ఘన విజయం సాధించిందని అన్నారు. వైసిపి ప్రభుత్వం గురించి అనవసరంగా మాట్లాడటం విజ్ఞత కాదని హితవు పలికారు. పవన్ ఎవరితో కలిసినా తమ పార్టీకి అభ్యంతరం లేదనీ, తాటాకు చప్పుళ్లకు భయపడమనీ అంబటి అన్నారు. ఏడు నెలల్లోనే ప్రభుత్వం విఫలమైందని అనడం సరికాదని పేర్కొన్నారు. కర్నులులో హైకోర్టు పెడితే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.ఏడు నెలల్లో ఒక్క అవినీతి కూడా జరగలేదనీ, సిఎం జగన్ స్వచ్చమైన పరిపాలన చేస్తుంటే ఓర్వలేక పోతున్నారనీ అంబటి విమర్శించారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేసి ప్రజలను వైసిపి ఓట్లు అడుగుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై లేని పోని ఆరోపణలు చేస్తే ఊరుకోమని అంబటి హెచ్చరించారు.