అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ది హత్యా లేక ఆత్మ హత్యా, కుటుంబ సభ్యుల పాత్ర ఎమిటి, చంద్రబాబు పాత్ర ఎమిటి అనే అంశాలపై సిబిఐ విచారణ జరిపించమంటారా అని వైసిపి ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు ప్రశ్నించారు.
టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాద్ సోమవారం హైదరాబాద్లో ఉరివేసుకొని తనువు చాలించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం వెనుక కుటుంబ సభ్యుల పాత్ర ఉందనీ, పార్టీ అధినేత చంద్రబాబుతో సహా పార్టీలో ఆయనకు అవమానాలు ఎదురుకావడంతోనే ఆత్మహత్య చేసుకున్నారనీ వైసిపి నేతలు ఆరోపించారు. కోడెల మృతిపై వైసిపి నేతలు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. కాగా కోడెల, ఆయన కుటుంబ సభ్యులపై జగన్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం వల్లనే ఆయన మానసిక వ్యధకు గురై ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనీ, ఇది ఆత్మహత్య కాదనీ, ప్రభుత్వం చేసిన హత్య అంటూ చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు ఆరోపించారు. హైదరాబాదులో కోడెల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో వైసిపి ప్రభుత్వంపై ఫిర్యాదు కూడా చేశారు. కోడెల మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని కూడా చంద్రబాబు డిమాండ్ చేశారు.
తాజాగా కోడెల ఆత్మహత్య కేసు విషయం గురించి గవర్నర్ను కలిసి వినతి పత్రాన్ని ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్న నేపథ్యంలో చంద్రబాబుపై అంబటి, గోపిరెడ్డిలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గవర్నర్ వద్దకు ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు వెళ్తున్నారని అంబటి, గోపిరెడ్డిలు ప్రశ్నించారు. గవర్నర్ అడిగే ప్రశ్నలకు ఏమి సమాధానాలు చెబుతారంటూ చంద్రబాబుకు వారు ప్రశ్నల వర్షం కురిపించారు.
‘గత మూడునెలలుగా మీరు కోడెలను దగ్గరకు రానిచ్చారా, కోడెల ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తలు విని ఆయనను పరామర్శించడానికి వెళ్లారా, అసెంబ్లీ నుంచి కోడెల కోట్ల రూపాయల ఫర్నిచర్ తరలించడం మీకు తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా, కోడెల ఫర్నిచర్ వ్యవహారంలో, ఆయన అరాచకాలకు గురై తట్టుకోలేక ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తే మీరు ఎందుకు నోరెత్తలేదు, గత ఐదేళ్లుగా కోడెల కొడుకు, కూతురు కే – ట్యాక్స్ వసూలు చేశారా, లేదా, గత ఐదేళ్లుగా కోడెలకు చెందిన ఫార్మా డీల్స్ మీకు తెలిసే జరిగాయా, తెలియకుండా జరిగాయా, గత ఐదేళ్లుగా కోడెల అవినీతి సామ్రాజ్యానికి మీరు వెన్నుదన్నుగా ఉన్నారా, లేదా, ఇటు సత్తెనపల్లిలోనూ, అటు నర్సరావుపేటలోనూ భూ కబ్జాల మీద మీరు విచారణ ఎందుకు చేయించలేదు, కోడెల తాను చనిపోకముందు మీకు ఫోన్ చేసి, అయ్యా.. ప్రస్తుత ప్రభుత్వం వేధింపులు ఎక్కువగా ఉన్నాయనీ, మీకు ఎప్పుడైనా చెప్పారా, చెప్తే మీరెందుకు స్పందించలేదు, ఎందుకు మాట్లాడలేదు, కోడెల తన మరణానికి ఈ ప్రభుత్వ వేధింపులు కారణమని వాంగ్మూలం ఎప్పుడైనా ఇచ్చారా, కోడెల చనిపోతూ తన మరణానికి కారణాలు ఇవి, అని ఎక్కడైనా పేర్కొన్నారా’ అని గవర్నర్ ప్రశ్నిస్తే ఎమి సమాధానం చెబుతారని చంద్రబాబును అంబటి, గోపిరెడ్డిలు ప్రశ్నించారు.
కోడెల శివప్రసాద్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సత్తెనపల్లి, నర్సరావుపేటల్లో చేసిన అరాచకాల మీద సిబిఐ విచారణ జరపమంటారా అని అంబటి ప్రశ్నించారు. అసలు సిబిఐని ఈ రాష్ట్రంలోకే రానివ్వమంటూ ప్రతిజ్ఞచేసి, జనరల్ పర్మిషన్ను ఉపసంహరించుకుంటూ జీవో కూడా జారీ చేసిన చంద్రబాబు నేడు సిబిఐ విచారణ అనడం హాస్యాస్పదంగా ఉందని వారు అన్నారు. ఆయనకు సిబిఐ మీద ఎప్పుడు నమ్మకం కుదిరిందని వారు ప్రశ్నించారు. శాంతి భద్రతల విషయంలో జోక్యం చేసుకోవడానికి గవర్నర్ ఎవరనీ, ఆయనకు ఏ హక్కు ఉందని జగన్మోహనరెడ్డిపై హత్యాయత్నం జరిగినప్పుడు మాట్లాడిన చంద్రబాబు ఈ రోజు ఏ మొహం పెట్టుకొని గవర్నర్ దగ్గరకు వెళుతున్నారని ప్రశ్నించారు. బిజెపి నేతలు రఘురాం సహా మరి కొందరు చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు చేసిన అవమానాల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆరోపించారు. ఈ విషయం కోడెలే స్వయంగా వారితో చెప్పారని అంబటి, గోపిరెడ్డి అన్నారు.
సిబిఐ విచారణ అంటూ జరిగితే ఏ 1 గా హాజరుకావాల్సింది చంద్రబాబేనని, అందుకు ఆయన సిద్ధమా అని వారు ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటికీ ప్రజలకు సమాధానం ఇచ్చి ఆ తర్వాత చంద్రబాబు గవర్నర్ వద్దకు వెళ్తే మర్యాదగా ఉంటుందని అంబటి అన్నారు. చంద్రబాబు మరీ దిగజారిపోయి మూడు రోజుల పాటు శవం పక్కనే ఉండి టిడిపిని బతికించుకునేందుకు సిగ్గుమాలిన రాజకీయం చేస్తున్నారని అంబటి విమర్శించారు.